Share News

Visakha MLC by Election: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:16 AM

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీచేయరాదని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది.

Visakha MLC by Election: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం

అత్యధిక స్థానిక ప్రజాప్రతినిధులు

వైసీపీ వైపు ఉన్నందునే

వైసీపీ తరఫున బొత్స నామినేషన్‌

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీచేయరాదని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. టీడీపీ కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్‌ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఓటర్లు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచిన వారే. పోటీ పెడితే.. గెలిపిస్తామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా.. అంత ప్రయాస పడి గెలవాల్సిన అవసరం లేదని నాయకత్వం భావించింది. ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్ధి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దాని వల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. నామినేషన్ల దాఖలుకు మంగళవారం చివరి రోజు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్‌ సక్రమమని తేలితే ఆయన ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.

బాబుతో పురందేశ్వరి భేటీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మధుకర్‌ సోమవారం రాత్రి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వర్తమాన రాజకీయ అంశాలు, పాలనాపరమైన విషయాలు, నామినేటెడ్‌ పదవుల భర్తీ, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.


వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్‌

స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. సోమవారం ఆయన రిటర్నింగ్‌ అధికారి, విశాఖ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌కు సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బలం లేదని తెలిసి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని నిలబెడితే దుశ్చర్య అవుతుందని వ్యాఖ్యానించారు. మొత్తం 838 ఓట్లలో వైసీపీకి 530 ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి అరకు ఎంపీ తనూజరాణి, నగర మేయర్‌ గొలగారి హరివెంకటకుమారి, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌, కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ బొత్స ఝూన్సీ తదితరులు హాజరయ్యారు. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వరకు వచ్చి నాయకులను కలిసి వెళ్లిపోయారు. స్వతంత్ర అభ్యర్థిగా షేక్‌ సఫీ నామినేషన్‌ వేశారు.

రూ.73 లక్షలు పెరిగిన బొత్స ఆస్తులు

మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత బొత్స సత్యనారాయణ ఆస్తులు రూ.73.14 లక్షలు పెరిగాయి. ఎమ్మెల్సీ స్థానానికి వేసిన నామినేషన్‌ పత్రాల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన పేరిట రూ.11.42 కోట్ల ఆస్తి ఉన్నట్టు పేర్కొన్నారు. తన సతీమణి పేరిట స్థిరాస్తి రూ.4.46 కోట్లు, చరాస్తి రూ.3.92 కోట్లు ఉన్నట్టు చూపించారు.

Updated Date - Aug 13 , 2024 | 06:58 AM