అంబటి కార్యాలయం ముట్టడి
ABN , Publish Date - Feb 17 , 2024 | 03:28 AM
దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలంటూ శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్,
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
సత్తెనపల్లి, ఫిబ్రవరి 16: దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలంటూ శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్, ఎన్ఎ్సయూఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. మంత్రి అంబటి కార్యాలయంలోనే ఉండటంతో ఆందోళనకారులు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులతోపాటు వైసీపీ కార్యకర్తలు కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను తోసేసి.. కొంతమందిని కాళ్లతో తన్నారు. వైసీపీ దాడిలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ఘంటా గోపీ గాయపడటంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విడిచిపెట్టారు.
మీరు పోలీసులా! : షర్మిల
‘మీరు పోలీసులా? వైసీపీ కిరాయి మనుషులా?’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి నిలదీశారు. శుక్రవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా? ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతల గొంతు పిసికి చంపాలని చూస్తారా? వైసీపీ గూండాలను పక్కన పెట్టిమరీ దాడులు చేయిస్తారా? ఆందోళన చేస్తున్నవారిని ఇష్టారాజ్యంగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించి, కారకులైనవారిని వెంటనే సస్పెండ్ చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు. ’