ముగిసిన మూడు రాజధానుల డ్రామా
ABN , Publish Date - Apr 04 , 2024 | 04:16 AM
అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు’’ అంటూ సుమారు 1300 రోజులుగా నిర్వహిస్తున్న శిబిరం ఎట్టకేలకు మూతపడింది.
తెరవెనుక సూత్రదారులకుప్రధాన పాత్రధారి ఝలక్
లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన గురునాధం
అమరావతి రైతులకే మద్దతు అని ప్రకటన
గుంటూరు, విజయవాడ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు’’ అంటూ సుమారు 1300 రోజులుగా నిర్వహిస్తున్న శిబిరం ఎట్టకేలకు మూతపడింది. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు తెరవెనుక ఉండి ఇంతకాలం నడిపించిన మూడు రాజధానుల డ్రామా అనూహ్యంగా ముగిసింది. ఇప్పటివరకు కిరాయి వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నడిపించిన బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గురునాధం హఠాత్తుగా పార్టీ ఫిరాయించడంతో మూడు రాజధానుల నినాదం మూగబోయింది. విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో బుధవారం చంద్రబాబు నివాసంలో నారా లోకేశ్ను కలిసిన గురునాథం టీడీపీ కండువా కప్పుకొన్నారు. అమరావతి రైతుల పోరాటాన్ని నీరుగార్చేందుకు జగన్ మూడు రాజధానుల నాటకాన్ని తెరపైకి తెచ్చారు. మందడం సమీపంలోని తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్లో 2020 ఫిబ్రవరి 9న మూడు రాజధానుల శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి గురునాధం నాయకత్వం వహించారు. టీడీపీలో చేరిన సందర్భంగా గురునాధం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన మూడు రాజధానుల మాటలు నమ్మి తాము మోసపోయామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రాజధాని అమరావతిలో పేదలకు పూర్తి న్యాయం చేసే భాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు తనకు హామీ ఇవ్వడంతో పార్టీలో చేరినట్లు గురునాధం తెలిపారు. అమరావతి రాజధాని రైతులకు మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించారు. బహుజన రాజకీయ యాత్ర చేపట్టి జగన్ రాజకోట రహస్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కాగా.. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. బుచ్చెయ్యపేట మండలానికి చెందిన సుమారు వెయ్యి మందికిపైగా నాయకులు, కార్యకర్తలు బుధవారం టీడీపీలో చేరారు.