నిప్పుల కొలిమిలా రాష్ట్రం
ABN , Publish Date - Apr 06 , 2024 | 03:23 AM
తీవ్రమైన ఎండ, పొడి వాతావరణం ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు శుక్రవారం అగ్నిగుండంలా మారాయి.
ఎండలకు తోడైన వడగాలి.. 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
పోరుమామిళ్లలో 44.5 డిగ్రీలు.. నంద్యాలలో 43.7 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన ఎండ, పొడి వాతావరణం ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు శుక్రవారం అగ్నిగుండంలా మారాయి. ఎండలకు వడగాలులు కూడా తోడవడంతో ఈ వేసవి సీజన్లో తొలిసారిగా అనేక ప్రాంతాలు నిప్పులకొలిమిని తలపించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ ఠారెత్తించింది. విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 159 మండలాల్లో గాడ్పులు వీచాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో గాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. అనేకచోట్ల 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీలు, పలుచోట్ల 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కడప జిల్లా పోరుమామిళ్లలో 44.5 డిగ్రీల గరిష్ఠ నమోదైంది. భారత వాతావరణ శాఖ అబ్జర్వేటర్లలో మాత్రం నంద్యాలలో 43.7 డిగ్రీలు నమోదైందని, ఇది శుక్రవారం దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతగా అధికారులు తెలిపారు. కాగా శనివారం రాష్ట్రంలో 179 మండలాల్లో తీవ్ర గాడ్పులు, 209 మండలాల్లో గాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్ధ హెచ్చరించింది.