Share News

ఇదో అగ్లీ దందా!

ABN , Publish Date - Aug 14 , 2024 | 04:14 AM

విజయవాడ రూరల్‌ అంబాపురంలో రెవెన్యూ సర్వే నంబరు 87లో మొత్తం 18.33 ఎకరాల పట్టా భూమి ఉంది.

ఇదో అగ్లీ దందా!
YS Jagan

అగ్రి భూములమ్మి బాధితుల్ని ఆదుకుంటానన్న జగన్‌

అదే హామీతో అధికారంలోకి.. కానీ, ఆ భూములపైనే కన్నేసిన నాటి మంత్రి

పక్కాగా కాజేసేందుకు జోగి ఫ్యామిలీ ప్లాన్‌.. సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఆ భూములు

బాబాయ్‌, కొడుకు ద్వారా 2160 గజాల అగ్రి భూముల కొనుగోలుకు రమేశ్‌ డ్రామా

‘నంబరు పొరపాటు’ పేరిట పెద్ద నాటకం.. కొన్నది సర్వే నంబరు 88లోనివి

సర్వే నం. 87కు మార్చాలంటూ సవరణ దరఖాస్తు.. అడ్డగోలుగా రిజిస్ర్టేషన్‌

పూర్తిగా సహకరించిన సర్వేయర్లు, అధికారులు

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

విజయవాడ రూరల్‌ అంబాపురంలో రెవెన్యూ సర్వే నంబరు 87లో మొత్తం 18.33 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమి యజమానులుగా కళ్లెం సాంబిరెడ్డి, కాకర్లపూడి అన్నపూర్ణ, యలవర్తి దేవేంద్రప్రసాద్‌, కళ్లెం అశోక్‌రెడ్డి, కళ్లెం రంగారెడ్డి, కళ్లెం శివప్రసాదరెడ్డి, గోకరాజు ఉమాదేవి, ఆరుమళ్ల రామలింగారెడ్డి, గరికపాటి జయలక్ష్మి పేర్లు ఉన్నాయి. ఇందులో జయలక్ష్మికి 2.81 ఎకరాలు ఉండగా, అందులో 0.65 సెంట్లు (3120 గజాలు) అల్లూరి కృష్ణమూర్తికి విక్రయించారు. ఆయన అగ్రిగోల్డ్‌ యజమానులైన అవ్వ ఉదయభాస్కర్‌, వెంకట సుబ్రమణ్యం తదితరులకు అందులో 2,293.05 గజాలు విక్రయించారు. ఇదే భూమిలో 2,160 గజాలను జోగి కుటుంబసభ్యులు దొంగపత్రాలతో కాజేశారు. అగ్రిగోల్డ్‌ భూముల చెంతనే రెవెన్యూ సర్వే నంబరు 88లో మొత్తం 7.47ఎకరాల పట్టాభూమి ఉంది. ఇందులో కనుమూరి వెంకట రామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు కుటుంబ సభ్యుల పేరున 4 ఎకరాలు ఉంది. ఈ భూమిని వీరు బొమ్ము వెంకట చలమా రెడ్డికి విక్రయించారు. చలమారెడ్డి అందులో ఒక ఎకరాను 2001లో పోలవరపు మురళీమోహన్‌కు విక్రయించారు. మురళీమోహన్‌ తాను కొనుగోలు చేసిన ఎకరాలో 2003లో ప్లాట్లు వేసి విక్రయించారు. తిరిగి అదే భూమిని 2014లో మహాలక్ష్మి ప్రాపర్టీస్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ తరఫున అడుసుమిల్లి మోహనరామదాసుకు విక్రయించారు. అంటే ఒకే భూమిని డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేశారు. అడుసుమిల్లి మోహనరామదాసు నుంచి 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్‌ వరుసగా 1086 గజాలు,

1074 గజాలు... మొత్తం 2160 గజాలు కొనుగోలు చేశారు. అప్పటికే డబుల్‌ రిజిస్ట్రేషన్‌ జరిగిన భూమిని కొన్న జోగి కుటుంబ సభ్యులు సర్వే నంబరు 88లో భూమి లేదని గుర్తించి తెలివిగా పక్కనే ఉన్న అగ్రిగోల్డ్‌ భూములపై కన్నేశారు. ఈ భూములను 2018 ఆగస్టు 14న జీవో 117, 2019 అక్టోబరు 17న జీవో 133 ద్వారా సీఐడీ అటాచ్‌మెంట్‌ చేసుకుంది. ఈ భూములను కబ్జా చేసేందుకు 2023 ఏప్రిల్‌ 29న జోగి రాజీవ్‌, వెంకటేశ్వరరావు స్వీయ సవరణ దస్తావేజు దాఖలుచేశారు. తాము సర్వే నంబరు 87లో ఉన్న భూమిని కొనుగోలు చేశామని, కానీ సర్వే నంబరు 88గా పడిందని దాన్ని మార్పు చేయాలని కోరారు. ఈ రకంగా సర్వే నంబరు 87లో సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములను తమ పేరుపై రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఆ సమయంలో జోగి రాజీవ్‌ తండ్రి జోగి రమేశ్‌ మంత్రిగా ఉండటం.. అధికారులు పూర్తిగా సహకరించడంతో వీరి పని సులువు అయింది. అయితే, వివాదాస్పద భూమిని తమ వద్ద ఉంచుకుంటే మున్ముందు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఆగమేఘాలపై ఆ భూమిని ప్లాట్లుగా వేసి 2023 మే 31న విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీ కార్పొరేటర్‌గా ఉన్న చైతన్యరెడ్డి కుటుంబసభ్యులు పడిగపాటి దుర్గాప్రసాద్‌, సోముల దుర్గాభవానీ, సోముల వెంకటేశ్వరరావు, పడిగపాటి సుబ్బారెడ్డి, పడిగపాటి బాలమ్మకు విక్రయించేసి జోగి కుటుంబ సభ్యులు చేతులు దులుపుకొన్నారు.

కాజేసి.. ప్రహరీ కట్టేసి...

సర్వే నంబరు 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్‌ భూములని జోగి రాజీవ్‌, జోగి వెంకటేశ్వరరావుకు పూర్తి అవగాహన ఉంది. ఆ భూములను తమ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడమే కాకుండా స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. తమ కబ్జాకు చట్టబద్ధత కల్పించేందుకు తాము కొనుగోలు చేసిన స్థలాలను సర్వే చేయాలని జోగి రాజీవ్‌, వెంకటేశ్వరరావు విజయవాడ రూరల్‌ మండల సర్వేయర్‌ ఎ.రమేశ్‌, అంబాపురం గ్రామ సర్వేయర్‌ కె.దేదీప్యకు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు సర్వేయర్‌ సంబంధిత స్థలాన్ని పరిశీలించి, సరిహద్దు స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలి. ఈ రెండు పనులు చేయకుండా స్థలాలను తాను పరిశీలించినట్టుగా రమేశ్‌, దేదీప్య నివేదికలు ఇచ్చారు. ఈ రెండు నివేదికలను ఆధారంగా చేసుకుని సర్వే నంబరు 87లోని భూమి జోగి రాజీవ్‌, జోగి వెంకటేశ్వరరావుకు చెందినదిగా నిర్ధారించారు. ఈ భూములను సీఐడీ జప్తు చేసిందని వెబ్‌ల్యాండ్‌లో స్పష్టంగా ఉంది. నున్న సబ్‌రిజిస్ట్రార్‌ దీన్ని పరిశీలించకుండానే రాజీవ్‌, వెంకటేశ్వరరావు పేరు మీద వారు సమర్పించిన స్వీయ సవరణ దస్తావేజును రిజిస్ట్రేషన్‌ చేశారు.

Updated Date - Aug 14 , 2024 | 07:17 AM