Share News

విద్యాసాగర్‌ అరెస్టు

ABN , Publish Date - Sep 21 , 2024 | 04:29 AM

ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు

విద్యాసాగర్‌ అరెస్టు

జెత్వానీ కేసులో డెహ్రాడూన్‌లో వైసీపీ నేత అదుపులోకి

నేడు ట్రాన్సిట్‌ వారెంట్‌పై బెజవాడకు.. ముంబై నటి కేసులో ఏ1గా నమోదు

ఆమె వాంగ్మూలం ఇచ్చాక పరార్‌.. కొన్నాళ్లు ముంబై, ఢిల్లీలో ఉన్నట్టు గుర్తింపు

విజయవాడ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాదంబరి కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌ వద్ద అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చిన తర్వాత ట్రాన్సిట్‌ వారెంట్‌పై శనివారం విజయవాడకు తీసుకొస్తారు. తనపై తప్పుడు కేసు నమోదుచేసి మానసికంగా వేధించారని కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, పలువురు పోలీసు అధికారులపై జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఇందులో కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. జెత్వానీ విజయవాడకు వచ్చి వాంగ్మూలం ఇచ్చినప్పటి నుంచి విద్యాసాగర్‌ పరారీలో ఉన్నారు. తాను నమోదు చేయించిన కేసుకు సంబంధించిన వివరాలు మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా కాదంబరి వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఉన్నతాధికారులు విచారణాధికారిని నియమించారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌లోని ఏసీపీ స్రవంతిరాయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమె కాదంబరితో పాటు తండ్రి నరేంద్రకుమార్‌ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. 100 పేజీలతో విచారణ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. కాదంబరి మొత్తం నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మూడుసార్లు పోలీసు కమిషనర్‌కు, నాలుగోసారి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐపీఎస్‌ అధికారులు పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అజ్ఞాతంలోకి వెళ్లిన విద్యాసాగర్‌ను పట్టుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించారు. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 04:30 AM