Share News

‘తాడేపల్లి’ దందా సంగతేంటి?

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:18 AM

రాష్ట్రంలో 2019 సెప్టెంబరు వరకు ఉచిత ఇసుక విధానం అమలైంది. ఆ తర్వాత ఉచితాన్ని ఎత్తేశారు. 2020లో గనుల శాఖకు వెంకటరెడ్డి డైరెక్టర్‌గా వచ్చారు.

‘తాడేపల్లి’ దందా సంగతేంటి?

గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దందాలో రూ.2586 కోట్ల దోపిడీ జరిగినట్టు ఏసీబీ చెబుతోంది. కానీ అనధికారికంగా 15 వేల కోట్లపైనే కొల్లగొట్టారని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఒక్క ‘తాడేపల్లి’కే 9 వేలకోట్లకు పైనే చేరినట్టు తెలుస్తోంది. ఇవేవీ గనుల శాఖ వద్ద ఉన్న డాక్యుమెంట్లు, నివేదికల్లో కనిపించవు. తెరవెనుక సాగిన దందా ఇది. పైకి కాంట్రాక్టు ఇచ్చినట్టే ఇచ్చి.. గుట్టుచప్పుడు కాకుండా ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతలకు ఇసుక దోపిడీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. 2021 మే నుంచి 2024 మే వరకు వారి నుంచి నెలానెలా కప్పం వసూలు చేశారు. ముఖ్య నేత సాగించిన ఈ దోపిడీపై ఏసీబీ విచారణ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

ఇసుక దోపిడీలో భారీ వాటా

ముఖ్య నేతకు 9 వేల కోట్ల కప్పం

ముఖచిత్రమే వెంకటరెడ్డిది

అసలు పాత్రధారి తెర వెనుకే

ఉమ్మడి జిల్లాలవారీగా వైసీపీ నేతలకు కాంట్రాక్టులు

జిల్లాకు 20-25 కోట్లు డీల్‌

2021-24 మధ్య వసూళ్లు

దోపిడీ 15 వేల కోట్లపైనే

గుట్టు విప్పాల్సిన కోణం ఇదే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వంలో ఇసుక కాంట్రాక్టులో నాటి గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ముఖచిత్రమే కనిపిస్తోంది. ఆ ముఖచిత్రం ముసుగు తీసేస్తే అసలు దొంగలు బయటకొస్తారు. ఇసుక అనధికారిక దందాను ఏసీబీ కూకటివేళ్లతో పెకిలిస్తే తాడేపల్లి గుట్టు బయటకొస్తుంది. ఆ కనెక్షన్‌ను పట్టుకొని విచారిస్తే 15 వేలకోట్ల పైనే ఇసుక కుంభకోణం బయట పడుతుందని స్వయంగా గనుల శాఖ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వం, అవినీతి నిరోధక శాఖ మాత్రం

కళ్ల ముందు కనిపిస్తున్న టెండర్లు, ఒప్పంద పత్రాల ఆధారంగానే విచారణ చేస్తున్నాయి. ఆ ఒక్క దారిలో విచారణ కొనసాగితే ఏసీబీ చెబుతున్న 2586 కోట్ల అక్రమాలకే పరిమితం అవుతుంది. అదే తెరచాటు తాడేపల్లి దోపిడీపై ఏసీబీ విచారిస్తే అవినీతి ఆనకొండలు బయటకొస్తాయని గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరి ప్రభుత్వం, ఏసీబీ ఆ దిశగా విచారణను ముందుకు తీసుకెళ్తాయా? తెరవెనుక ఉన్న తాడేపల్లి క్విడ్‌ ప్రోకో మాస్టర్‌ మైండ్‌ గుట్టును బయటకు లాగుతాయా? ఇసుకలో అసలు దొంగలు మింగిన సొమ్మును కక్కించాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.

యథేచ్ఛగా అక్రమాలు

రాష్ట్రంలో 2019 సెప్టెంబరు వరకు ఉచిత ఇసుక విధానం అమలైంది. ఆ తర్వాత ఉచితాన్ని ఎత్తేశారు. 2020లో గనుల శాఖకు వెంకటరెడ్డి డైరెక్టర్‌గా వచ్చారు. 2021 మే నుంచి 2023 మే వరకు రెండేళ్ల కాలపరిమితితో ఇసుక తవ్వకం, అమ్మకం కాంట్రాక్టును నాటి జగన్‌ సర్కారు జేపీ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీకి కట్టబెట్టింది. జేపీ వెంచర్స్‌ను తమ నేతే తీసుకొచ్చారని, ఇసుక అంతా తమదే అని భావించిన వైసీపీ నేతలు రీచ్‌లు, నదులు, వాగులు, వంకలపై పడి ఇసుకను తోడేసుకున్నారు. దీంతో జేపీ వెంచర్స్‌ చేతులెత్తేసింది. ఆ సంస్థను ముందు పెట్టి వైసీపీ ముఖ్యనేతే తాడేపల్లి నుంచి ఇసుక దందా నడిపించారని స్వయంగా నాటి గనుల శాఖ అధికారులు, ఆ పార్టీ నేతలే అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. సబ్‌కాంట్రాక్టు నుంచి టర్న్‌కీ సంస్థ వైదొలిగాక వైసీపీ నేతలు పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయారు. ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతలు తాడేపల్లి నుంచి ఇసుక కాంట్రాక్టులు పొందారు. ప్రతీ నెల ఒక్కో జిల్లా నుంచి 20-25 కోట్ల చొప్పున తాడేపల్లికి కప్పం కట్టేలా ఒప్పందం చేసుకున్నాకే ఇసుక వ్యాపారం కట్టబెట్టారు. ఇలా వ్యాపారం చేజిక్కించుకున్నవారిలో అప్పటి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. ఇలా 2024 మే దాకా అనధికారిక ఇసుక దోపిడీ అప్రతిహతంగా కొనసాగింది.

ఈ మధ్యలో తాడేపల్లి నుంచి చెల్లింపుల ఒత్తిళ్లు భరించలేక ఓ ఇసుక కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదంతంతోనే తాడేపల్లి దందా తీవ్రత బయటి ప్రపంచానికి తెలిసింది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ ఒత్తిడి భరించలేక ఇసుక వ్యాపారాన్ని వదిలేసుకొని తాడేపల్లి సూచించిన వారికి అప్పగించారు. ప్రతీ నెల తాడేపల్లికి 260 కోట్ల మేర చేరేవని చెబుతున్నారు. ఈ లెక్కన తాడేపల్లికి చెల్లించిన కప్పమే 9 వేల కోట్లపైనే. సగటున నెలకు 20 కోట్ల లెక్క తీస్తేనే ఇంత మొత్తం వస్తోంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల నుంచి 25 కోట్లు వస్తే, మరి కొన్ని జిల్లాల నుంచి 20 కోట్ల మేర చెల్లింపులు చేశారు. తాడేపల్లికే నెలకు ఇంత కప్పం వస్తే.. ఇసుక వ్యాపారం చేసిన వైసీపీ నేతలకు నెలకు ఎంత మిగిలిందో ఊహించుకోవచ్చు. మూడేళ్ల వ్యవధిలో మొత్తం 15 వేలకోట్లపైనే ఇసుక దోపిడీ జరిగిందని అధికార వర్గాలే విస్తుపోతున్నాయి.

Updated Date - Sep 26 , 2024 | 04:29 AM