Share News

2,840 విమానాలు.. 41,000 పైలెట్లు అవసరం

ABN , Publish Date - Jan 19 , 2024 | 05:28 AM

భారత విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. వచ్చే ఇరవై ఏళ్లలో భారత విమానయాన రంగానికి 2,840 కొత్త విమానాలు అవసరం అవుతాయి. 41,000 మంది పైలెట్లు కావాలి. 47,000 మంది టెక్నికల్‌ స్టాప్‌ అవసరం....

2,840 విమానాలు..  41,000  పైలెట్లు అవసరం

భారత విమానయాన మార్కెట్‌పై ఎయిర్‌బస్‌ అంచనా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. వచ్చే ఇరవై ఏళ్లలో భారత విమానయాన రంగానికి 2,840 కొత్త విమానాలు అవసరం అవుతాయి. 41,000 మంది పైలెట్లు కావాలి. 47,000 మంది టెక్నికల్‌ స్టాప్‌ అవసరం ఉందని ఎయిర్‌బస్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రెసిడెంట్‌ రెమి మైలార్డ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన వింగ్స్‌ ఇండియా 2024లో ఆయన మాట్లాడుతూ.. ఎయిర్‌బ్‌సకు 2023 ఏడాది రికార్డు సంవత్సరం. గత ఏడాది భారత్‌లోని విమానయాన సంస్థలకు 75 విమానాలను అందించాం. 750 విమానాలకు ఆర్డర్లు పొందాం. అంతర్జాతీయ గమ్యస్థానాలకు భారత విమానయాన సంస్థలు అందిస్తున్న సేవల్లో ఏ350 విమానం కీలకం కానుందని.. ఇప్పటికే ఎయిరిండియాకు 6 విమానాలను అందించామని చెప్పారు. కాగా దేశంలోనే తొలి, ఎయిరిండియా మొదటి ఎయిర్‌బస్‌ ఏ350 విమానాన్ని వింగ్స్‌ ఇండియాలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.

ఎయిరిండియాతో కలిసి పైలెట్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు

పైలెట్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎయిరిండియాతో ఎయిర్‌బస్‌ చేతులు కలిసింది. 50:50 సంయుక్త సంస్థ ఏర్పాటు చేసి హరియాణాలోని గురుగ్రామ్‌ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. రానున్న 20 ఏళ్లలో పైలెట్ల అవసరం బాగా ఉన్నందున ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రెమి తెలిపారు. 2025 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే ఈ శిక్షణ కేంద్రం ఏ320, ఏ350 విమానాలను నడిపేందుకు శిక్షణ ఇస్తుంది. 10 ఏళ్లలో 5,000 మంది పైలెట్లను తయారు చేస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌తో కూడా ఎయిర్‌బస్‌ చేతులు కలిపింది.

150 బోయింగ్‌ విమానాలకు ఆకాశ ఎయిర్‌ ఆర్డర్‌

దేశీయ, అంతర్జాతీయ సేవలను విస్తరించడానికి ఆకాశ ఎయిర్‌ 150 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ఈ విమానాలను 2032 వరకూ డెలివరీ చేస్తారు. కొత్త డీల్‌తో మొత్తం 226 విమానాల కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లవుతుందని ఆకాశ ఎయిర్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్‌ దుబే తెలిపారు. ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌ 22 విమానాలతో సేవలందిస్తోంది. ఎనిమిదేళ్లలో 204 విమానాలను పొందనుంది. ఈ స్థాయి విమానాలతో దశాబ్ద కాలం నాటికి ప్రపంచంలోని 30 ప్రముఖ విమానయా న కంపెనీల్లో ఆకాశ ఎయిర్‌ ఒకటి అవుతుందని తెలిపారు. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ మార్గాల్లో ఆకాశ ఎయిర్‌ సేవలను అందించనుంది.

మహీంద్రా, టాటా అడ్వాన్స్‌డ్‌తో తయారీ కాంట్రాక్టులు

భారత్‌ నుంచి మరింతగా విమాన విడి భాగాలను పొందే కార్యక్రమంలో భాగంగా టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎ్‌సఎల్‌), మహీంద్రా ఏరోస్పేస్‌ స్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఎయిర్‌బస్‌ అదనపు తయారీ కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా ఏ320 నియో, ఏ330 నియో, ఏ350 విమానాలకు అవసరమైన మెటాలిక్‌ డీటైల్డ్‌ విడిభాగాలు మొదలైన వాటిని టీఏఎ్‌సఎల్‌, మహీంద్రా ఏరోస్పే్‌సలు అందిస్తాయి. దేశంలోని దాదాపు 100 కంపెనీలు ఎయిర్‌బ్‌సకు విడి భాగాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం 75 కోట్ల డాలర్ల విలువైన విడిభాగాలను ప్రతి ఏడాది పొందుతుండగా.. దీన్ని 150 కోట్ల డాలర్ల (దాదాపు రూ.12,150 కోట్లు)కు పెంచుకోవడానికి భారత్‌లో మరింత మంది వెండార్లతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు రెమి తెలిపారు.

జీఎంఆర్‌ గ్రూప్‌, ఇండిగో ఒప్పందం

భారత విమానాయాన రంగంలో డిజిటల్‌ టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి జీఎంఆర్‌ గ్రూప్‌, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు అనుగుణంగా డిజిటల్‌ కన్సార్షియంను ఏర్పాటు చేస్తాయి. కన్సార్షియంలో విమానయాన రంగ భాగస్వాములు ఉంటారు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, నిర్వహణ సామర్థ్యాలను పెంచడానికి కన్సార్షియం డిజిటల్‌ టెక్నాలజీలను వినియోగిస్తుందని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ ఎస్‌జీకే కిషోర్‌ తెలిపారు.

ఎయిర్‌బస్‌ ఇండియా ఎండీ రెమి మైలార్డ్‌

Updated Date - Jan 19 , 2024 | 05:28 AM