వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75-80 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jan 09 , 2024 | 03:05 AM
సామర్థ్య విస్తరణకు మోల్డ్టెక్ ప్యాకేజింగ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.75-80 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే మూడు కొత్త తయారీ యూనిట్లను ఏర్పాటు చేసిన కంపెనీ...
మహారాష్ట్రలో నాలుగో కొత్త యూనిట్.. మోల్డ్టెక్ ప్యాకేజింగ్ వెల్లడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సామర్థ్య విస్తరణకు మోల్డ్టెక్ ప్యాకేజింగ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.75-80 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే మూడు కొత్త తయారీ యూనిట్లను ఏర్పాటు చేసిన కంపెనీ మహారాష్ట్రలోని మహద్లో నాలుగో యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు అవసరమైన భూమిని సేకరించామని, రూ.20 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనిట్ వార్షిక సామర్థ్యం 1,500 టన్నులు ఉంటుందని మోల్డ్టెక్ ప్యాకేజింగ్ సీఎండీ లక్ష్మణ్ రావు తెలిపారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అవసరాల కోసం దీన్ని ప్రారంభిస్తున్నారు. తమిళనాడులోని చెయ్యార్, తెలంగాణలోని సుల్తాన్పూర్లో కొత్తగా నిర్మించిన ప్లాంట్లను కంపెనీ ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితం హరియాణాలోని పానిపట్లో నిర్మించిన యూనిట్ను కూడా ప్రారంభించింది. ఈ మూడు యూనిట్లపై మోల్డ్టెక్ రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టింది. నాలుగు యూనిట్లలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభమైతే.. 2024-25 చివరి నాటికి మోల్డ్టెక్ ప్యాకేజింగ్ వార్షిక సామర్త్యం 54,000 టన్నులకు చేరుతుంది. వచ్చే 5-6 ఏళ్లలో ఫుడ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలకు సరఫరా చేసే ఉత్పత్తుల విలువ మొత్తం టర్నోవర్లో దాదాపు 50 శాతం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిమాణపరంగా విక్రయాలు 15-18 శాతం పెరగవచ్చని భావిస్తోంది. 2023-24లో పతంజలి, జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా వంటి కంపెనీలు మోల్డ్టెక్ ప్యాకేజింగ్ ఖాతాదారుల జాబితాలో చేరాయి.