Share News

బ్యాంక్‌లూ డిపాజిట్లు పెంచండి

ABN , Publish Date - Aug 11 , 2024 | 02:35 AM

బ్యాంక్‌లు డిపాజిట్ల సమీకరణ, రుణ వితరణ వంటి కీలక కార్యకలాపాలపై దృష్టిసారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్భోదించారు. కుటుంబ పొదుపు ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలు...

బ్యాంక్‌లూ డిపాజిట్లు పెంచండి

  • ప్రజల నుంచి నిధుల సమీకరణకు కొత్త మార్గాలను అన్వేషించండి

  • కీలక కార్యకలాపాలపై దృష్టిసారించండి

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచన

న్యూఢిల్లీ: బ్యాంక్‌లు డిపాజిట్ల సమీకరణ, రుణ వితరణ వంటి కీలక కార్యకలాపాలపై దృష్టిసారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్భోదించారు. కుటుంబ పొదుపు ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలు, సాధనాల్లోకి మళ్లుతున్న తరుణంలో ప్రజల నుంచి డిపాజిట్లను ఆకర్షించేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలని బ్యాంక్‌లకు సూచించారు. ఆర్‌బీఐ కేంద్రం బోర్డుతో శనివారం నిర్వహించిన సంప్రదాయక పోస్ట్‌ బడ్జెట్‌ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ బ్యాంక్‌లు తమ కీలక వ్యాపార కార్యకలాపాలపై దృష్టిసారించాలని ఆర్‌బీఐతోపాటు కేంద్రం కోరుతున్నాయి. డిపాజిట్ల సమీకరణ, ఆ తర్వాత రుణ వితరణలో దూకుడుగా ఉండాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో డిపాజిట్లు, రుణాల వృద్ధి మధ్య అంతరం పెరిగిపోయింది. రుణాల వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లు పెరగడం లేదు. కాబట్టి, డిపాజిట్ల సేకరణకు ప్రాధాన్యమివ్వాలి. వడ్డీ రేట్ల నిర్వహణ విషయంలో ఆర్‌బీఐ ఇప్పటికే బ్యాంక్‌లకు కొంత స్వేచ్ఛ ఇచ్చింది. తద్వారా బ్యాంక్‌లు డిపాజిట్‌ రేట్లను మరింత ఆకర్షణీయంగా మార్చాలి. కొత్త ఆర్థిక సాధనాల ద్వారా నిధులు సమీకరించాలన్నారు.


బ్యాంక్‌లు సోమరితనాన్ని వీడి, బల్క్‌ డిపాజిట్లకు బదులు చిన్న పొదుపుదారుల నుంచి డిపాజిట్లు రాబట్టడంపై దృష్టిసారించాలని సీతారామన్‌ సూచించారు. అది చాలా కష్టమైన పనే అయినప్పటికీ, అదే మిమ్మల్ని పోషిస్తుందన్నారు. ప్రస్తుతం రుణ వృద్ధితో పోలిస్తే డిపాజిట్ల వృద్ధి 3-4 శాతం తక్కువగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ఈ అంశాన్ని ఎత్తిచూపడమే తమ ఉద్దేశమని, బ్యాంక్‌ యాజమాన్యాలకు ఇది ముందుచూపుతో చేసిన హెచ్చరికని అయన పేర్కొన్నారు. ఎందుకంటే, అంతరం పెరుగుతూ పోతే, బ్యాంకింగ్‌ రంగానికిది వ్యవస్థాగత సమస్యగా పరిణమించే ముప్పు ఉందన్నారు. బ్యాంక్‌లు వినూత్న ఆర్థిక పథకాలు, సేవల ద్వారా డిపాజిట్ల సమీకరణను పెంచుకోవాలని సూచించారు. ఇందుకోసం తమ శాఖలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఈ వారం ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటించిన సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ సూచించారు.

Updated Date - Aug 11 , 2024 | 02:35 AM