Share News

బ్యాంకులు భళా

ABN , Publish Date - Jul 21 , 2024 | 02:12 AM

దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సహా 5 బ్యాంకులు శనివారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. అందులో ఓ ప్రభుత్వ రంగ బ్యాంకూ ఉంది. అన్ని బ్యాంకుల లాభం, ఆదాయాల్లో మెరుగైన వృద్ధి....

బ్యాంకులు భళా

క్యూ1లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ఐదు దేశీయ బ్యాంకులు

ముంబై: దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సహా 5 బ్యాంకులు శనివారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. అందులో ఓ ప్రభుత్వ రంగ బ్యాంకూ ఉంది. అన్ని బ్యాంకుల లాభం, ఆదాయాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. ఆ వివరాలు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.16,474 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రతిపాదికన 33.17 శాతం వృద్ధితో రూ.16,474.85 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి బ్యాంక్‌ లాభం రూ.12,370 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ క్యూ1లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.83,701 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాదిలో ఇదే సమయానికి రాబడి రూ.57,816 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.47 శాతానికి మెరుగుపడటంతో ఈ జూన్‌ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 2.6 శాతం వృద్ధితో రూ.29,840 కోట్లకు పెరిగింది. వడ్డీయేతర ఆదాయం మాత్రం 41.3 శాతం తగ్గి రూ.10,670 కోట్లకు పరిమితమైంది.


వార్షిక ప్రాతిపదికన పోలిస్తే, మొండిబకాయిల నష్టాలను పూడ్చుకోవడంతోపాటు ఇతర అవసరాల కోసం బ్యాంక్‌ కేటాయింపులు రూ.2,860 కోట్ల నుంచి రూ.2,602 కోట్లకు తగ్గాయి. ఈ మార్చి చివరినాటికి, మొత్తం ఆస్తుల్లో 1.24 శాతంగా నమోదైన మొండిబాకీలు లేదా స్థూల నిరర్థక ఆస్తుల (గ్రాస్‌ ఎన్‌పీఏ) వాటా.. ఈ జూన్‌ 30 నాటికి 1.33 శాతానికి పెరిగింది. గత నెలాఖరు నాటికి బ్యాంక్‌ మూలధన సమృద్ధి నిష్పత్తి 19.33 శాతంగా నమోదైంది.

కోటక్‌ బ్యాంక్‌ లాభంలో స్వల్ప వృద్ధి

ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి గాను కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ.3,520 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,452 కోట్ల లాభంతో పోలిస్తే 2 శాతం వృద్ధి నమోదైంది. ఏకీకృత నికర లాభం మాత్రం 79 శాతం వృద్ధితో రూ.7,448 కోట్లుగా నమోదైంది. బీమా విభాగంలో విక్రయం ద్వారా ఆదాయం సమకూరడం ఇందుకు కలిసివచ్చింది. కాగా, గడిచిన మూడు నెలల్లో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.15,675 కోట్లకు పెరిగింది. గత ఏడాదిలో ఇదే సమయానికి రాబడి రూ.13,183 కోట్లుగా ఉంది.


బ్యాంక్‌కు వడ్డీ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.12,746 కోట్లకు ఎగబాకింది. ఈ మార్చి 31తో పోలిస్తే, జూన్‌ చివరినాటికి బ్యాంక్‌ మొండి బాకీలు లేదా గ్రాస్‌ ఎన్‌పీఏలు ఎలాంటి మార్పు లేకుండా 1.39 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 0.40 శాతం నుంచి 0.35 శాతానికి తగ్గాయి. ఈ జూన్‌ 30 నాటికి బ్యాంక్‌ మూలధన సమృద్ధి నిష్పత్తి 22.41 శాతంగా ఉంది.

యెస్‌ బ్యాంక్‌ లాభంలో 47 శాతం వృద్ధి

ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను యెస్‌ బ్యాంక్‌ లాభం వార్షిక ప్రాతిపదికన 46. శాతం వృద్ధితో రూ.502 కోట్లకు చేరుకుంది. మొండి బాకీల కోసం కేటాయింపులు తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదపడింది. గత మూడు నెలల్లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 12.2 శాతం పెరిగి రూ.2,000 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) మాత్రం 2.4 శాతంగానే కొనసాగింది. అయితే, ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో సవాలుగా మారిన డిపాజిట్ల సమీకరణలో విషయంలో మాత్రం యెస్‌ బ్యాంక్‌ మంచి ప్రగతి సాధించింది. గత మూడు నెలల్లో బ్యాంక్‌ డిపాజిట్లలో 20 శాతం వృద్ధి నమోదైంది. ఎన్‌పీఏలు సహా ఇతర అవసరాల కోసం బ్యాంక్‌ కేటాయింపులు 41.2 శాతం తగ్గి రూ.212 కోట్లకు పరిమితమయ్యాయి. సమీక్షా కాలానికి బ్యాంక్‌ గ్రాస్‌ ఎన్‌పీఏలు 1.7 శాతంగా నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 16-17 శాతం రుణ వృద్ధిని లక్ష్యం గా పెట్టుకున్నట్లు యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.


యూబీఐ లాభం రూ.3,679 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) నికర లాభం వార్షిక ప్రాతిపదికన 13.7 శాతం వృద్ధితో రూ.3,679 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 6.5 శాతం పెరిగి రూ.9,412 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) మాత్రం 0.13 శాతం తగ్గి 3.05 శాతానికి పరిమితమైంది. డిపాజిట్ల సమీకరణ వ్యయం పెరగడంతో వడ్డీ మార్జిన్లను 3 శాతం ఎగువన కొనసాగించడం సవాలుగా మారిందని యూబీఐ ఎండీ, సీఈఓ ఏ మణిమేఖలై అన్నారు. కాగా, సమీక్షా కాలానికి బ్యాంక్‌ ఇతర ఆదాయం 15.53 శాతం పెరిగి రూ.4,509 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో రూ.2,318 కోట్ల రుణాలు మొండి పద్దుల్లోకి మళ్లాయి. అయినప్పటికీ, జూన్‌ చివరినాటికి బ్యాంక్‌ మొండిబాకీలు లేదా గ్రాస్‌ ఎన్‌పీఏలు 4.54 శాతానికి తగ్గాయి. కానీ, మొండిబాకీలతో పాటు ఇతర అవసరాల కోసం కేటాయింపులు మాత్రం రూ.4,106 కోట్లకు పెరిగాయి. బ్యాంక్‌ మూలధన సమృద్ధి నిష్పత్తి 17.92 శాతానికి మెరుగుపడింది. నిధులపరంగా బ్యాంక్‌ పరిస్థితి సౌఖ్యంగానే ఉందని మణిమేఖలై అన్నారు. గతంలో ప్రకటించిన 11-13 శాతం రుణ వృద్ధి, 8-10 శాతం డిపాజిట్ల వృద్ధి లక్ష్యాలను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.


ఆకట్టుకున్న ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌

జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలోలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 29 శాతం పెరిగి రూ.372 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.1,700 కోట్లకు పెరిగింది. రుణాల్లో 19 శాతం పెరుగుదల వడ్డీ ఆదాయ వృద్ధికి తోడ్పడింది. కాగా, నికర వడ్డీ మార్జిన్‌ 5.67 శాతంగా నమోదైంది. ఈ జూన్‌ చివరినాటికి బ్యాంక్‌ గ్రాస్‌ ఎన్‌పీఏలు 2.69 శాతానికి తగ్గాయి.

Updated Date - Jul 21 , 2024 | 02:12 AM