Share News

భారత పౌర విమానయానం అదుర్స్‌

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:13 AM

భారత పౌర విమానయాన మార్కెట్‌ పురోభివృద్ధిపై ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ అత్యంత ఆశాభావం వ్యక్తం చేసింది.

భారత పౌర విమానయానం అదుర్స్‌

పోటీతో ప్రయాణికులకు మరింత మేలు.. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ సీసీఓ అద్నాన్‌

దుబాయ్‌: భారత పౌర విమానయాన మార్కెట్‌ పురోభివృద్ధిపై ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ అత్యంత ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే మార్కెట్‌ పెరుగుదలకు అనుగుణంగా భారత్‌-యూఏఈ మధ్య విమాన సర్వీసులు పెరగక పోవడంపై ఆ సంస్థ డిప్యూటీ ప్రెసిడెంట్‌, చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ (సీసీఓ) అద్నాన్‌ కజిమ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దుబాయ్‌లో జరిగిన ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. భారత్‌లో మరిన్ని పౌర విమానయాన సంస్థలను అనుమతిస్తే పోటీ పెరిగి ప్రయాణికుల తమకు ఇష్టమైన ఎయిర్‌లైన్‌ను ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం రెండు దేశాల విమానయాన సంస్థలు వారానికి 1.3 లక్షల సీట్ల సామర్ధ్యంతో విమాన సర్వీసులు నడుపుతున్నా, రద్దీ తగ్గడం లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సీట్ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని కజిమ్‌ తెలిపారు.

స్టార్‌ అలయెన్స్‌తో మేలు: ఎయిర్‌ ఇండియా- లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ మధ్య ఉన్న భాగస్వామ్య ఒప్పందం రెండు విమానయాన సంస్థల ప్రయాణికులకు మేలు చేస్తుందని ఇదే సదస్సుకు హాజరైన స్టార్‌ అలయెన్స్‌ గ్రూప్‌ సీఈఓ థియో పనాజియోటౌలియాస్‌ అన్నారు. ఈ భాగస్వామ్యంతో ప్రపంచంలోని 50 ప్రముఖ విమానాశ్రయాల్లో 26 విమానయాన సంస్థల సేవలను ప్రయాణికులు వినియోగించుకునేందుకు వీలవుతుందన్నారు. మరిన్ని భారత విమానయాన సంస్థలు స్టార్‌ అలయెన్స్‌లో చేరాలని కోరుతున్నట్టు తెలిపారు.

లాభాలకు చేరువలో: ఆకాశ ఎయిర్‌

తమ సంస్థ లాభాలకు చేరువలో ఉందని దుబాయ్‌ ఐఏటీఏ వార్షిక సదస్సుకు హాజరైన ఆకాశ ఎయిర్‌ వ్యవస్థాకుడు ఆదిత్య ఘోష్‌ తెలిపారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభించే యోచన ఉందన్నారు. ఇదే సమయంలో దేశంలోని ద్వితీ, తృతీయ శ్రేణి నగరాలకూ తమ సర్వీసులు విస్తరిస్తామన్నారు. ఈ నెల 15 నుంచి జెడ్డాకు తమ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ఘోష్‌ తెలిపారు.

Updated Date - Jun 10 , 2024 | 04:28 AM