Share News

లిక్విడేషన్‌కు గీతాంజలి జెమ్స్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:37 AM

పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ లిక్విడేషన్‌ (ఆస్తుల విక్రయం)కు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సోమవారం ఆదేశించింది....

లిక్విడేషన్‌కు గీతాంజలి జెమ్స్‌

ముంబై: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ లిక్విడేషన్‌ (ఆస్తుల విక్రయం)కు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సోమవారం ఆదేశించింది. కంపెనీ లిక్విడేటర్‌గా ‘శాంతను టీ రే’ ను నియమించింది. దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా గీతాంజలి జెమ్స్‌ పునరుద్ధరణ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లడంతో కంపెనీ దివాలా పరిష్కార నిపుణుడు విజయ్‌ కుమార్‌ గార్గ్‌ లిక్విడేషన్‌కు అనుమతించాలని ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు సమర్పించారు. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తికి గడువు 2019 ఏప్రిల్‌లోనే ముగియడంతో పాటు సంస్థపై కొనసాగుతున్న ఈడీ, సీబీఐ దర్యాప్తులు, పలు ఆస్తులు ఈ దర్యాప్తు ఏజెన్సీల జప్తులో ఉన్న నేపథ్యంలో ట్రైబ్యునల్‌ లిక్విడేషన్‌కు ఆదేశించింది.

గీతాంజలి జెమ్స్‌ పలు బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలకు రూ.12,558 కోట్లకు బకాయిపడింది. దివాలా పరిష్కార చర్యల ద్వారా ఏదైనా కంపెనీ వ్యాపార పునరుద్ధణ సాధ్యం కాని పక్షంలో దాని ఆస్తుల విక్రయం ద్వారా రుణదాతల బకాయిలను పరిష్కరించే ప్రక్రియనే లిక్విడేషన్‌ అంటారు

Updated Date - Feb 20 , 2024 | 04:37 AM