లాభాల బాటలోనే..
ABN , Publish Date - Apr 24 , 2024 | 06:11 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మదుపరులు టెలికాం, టెక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. అయితే, ముడి చమురు ధరల పెరుగుదల...
సెన్సెక్స్ 90 పాయింట్లు అప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మదుపరులు టెలికాం, టెక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. అయితే, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్ లాభాలను పరిమితం చేశాయి. మంగళవారం ట్రేడింగ్లో బీఎ్సఈ సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లకు పైగా పుంజుకున్నప్పటికీ, చివరికి 89.83 పాయింట్ల లాభంతో 73,738.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31.60 పాయింట్ల వృద్ధితో 22,447.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో 18 లాభపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్ విషయానికొస్తే, డాలర్తో రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 83.31 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ రకం ముడి చమురు పీపా ధర ఒకదశలో 0.41 శాతం పెరిగి 87.36 డాలర్ల వద్ద ట్రేడైంది.
ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓకు సెబీ ఓకే : కో-వర్కింగ్ స్పేస్ కంపెనీ ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్తో పాటు ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టీబీఓ టెక్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రతిపాదనలకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా టీబీఓ టెక్ రూ.400 కోట్ల తాజా ఈక్విటీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 1,56,35,996 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనుంది. ఆఫీస్ స్పేస్ రూ.160 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు పలు ఇన్వెస్టర్లకు చెందిన కోటికి పైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన అమ్మకానికి పెట్టనుంది.
నోయిడాకు చెందిన లిథియం బ్యాటరీ, సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్సీఆర్ఎస్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు ఎన్ఎ్సఈలోని ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ఎన్ఎ్సఈ ఎమర్జ్కు ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.10 ముఖవిలువ కలిగిన 48.24 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. తద్వారా సేకరించే నిధులను వ్యాపార విస్తరణకు ఉపయోగించుకోనున్నట్లు సంస్థ పేర్కొంది.
జేఎన్కే ఇండియా పబ్లిక్ ఆఫరింగ్ తొలిరోజు ముగిసేసరికి, ఇష్యూ సైజులో 49 శాతానికి సమానమైన సబ్స్ర్కిప్షన్ లభించింది.
నిఫ్టీ నెక్ట్స్ 50 డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ నేటి నుంచే..
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎ్సఈ) నిఫ్టీ నెక్స్ట్ 50 డెరివేటివ్ కాంట్రాక్టులను బుధవారం నుంచి ప్రవేశపెట్టనుంది. ఈ కాంట్రాక్టుల ట్రేడింగ్ను ప్రారంభించేందుకు ఎక్స్ఛేంజీకి ఈ మధ్యనే సెబీ ఆమోదం తెలిపింది. నిఫ్టీ 100లో నిఫ్టీ 50 కంపెనీలను మినహాయించగా మిగిలిన కంపెనీలకు ప్రాతినిథ్య సూచీయే నిఫ్టీ నెక్స్ట్ 50. ఈ డెరివేటివ్ కాంట్రాక్టుల్లో భాగంగా ఎక్స్ఛేంజీ మూడు వరుస నెలల ఇండెక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ఆఫర్ చేయనుంది.