Stock Market: శనివారం కూడా పని చేయనున్న స్టాక్మార్కెట్లు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్.. ఎందుకంటే..
ABN , Publish Date - Mar 01 , 2024 | 08:59 PM
సాధారణంగా స్టాక్మార్కెట్లు వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయి. శనివారం, ఆదివారం స్టాక్మార్కెట్లకు సెలవు. అయితే ఈ శనివారం (మార్చి 2) మాత్రం ఎన్ఎస్ఈ, బీఎస్ఈ కొన్ని గంటలు పని చేయనున్నాయి.
సాధారణంగా స్టాక్మార్కెట్లు (Stock Market) వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయి. శనివారం, ఆదివారం స్టాక్మార్కెట్లకు సెలవు. అయితే ఈ శనివారం (మార్చి 2) మాత్రం ఎన్ఎస్ఈ (NSE), బీఎస్ఈ (BSE) కొన్ని గంటలు పని చేయనున్నాయి. విపత్తు సంభవించినప్పుడు వ్యాపార కొనసాగింపునకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను మార్చి 2న ప్రత్యక్ష ట్రేడింగ్ (Special live trading) సెషన్లను నిర్వహిస్తున్నట్టు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తెలిపాయి.
మార్చి 2న తొలి సెషన్ ఉదయం 09:15 గంటలకు ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుంది. అలాగే రెండో సెషన్ ఉదయం 11:30 గంటలకు ప్రారంభమై 12:30 గంటలకు ముగుస్తుంది. ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్కు ఇంట్రా-డే స్విచ్ ఓవర్తో ఈ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ను నిర్వహిస్తున్నారు. ఊహించని విపత్తు సంభవించినప్పుడు రికవరీ సైట్లలో వ్యాపార కొనసాగింపు ప్రణాళిక సాఫీగా మారేలా చేసేందుకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక ట్రేడింగ్ను నిర్వహిస్తున్నాయి.
ఈ లైవ్ ట్రేడింగ్ సెషన్ను ఈ ఏడాది జనవరిలోనే ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నిర్వహించాలనుకున్నాయి. జనవరి 20వ తేదీన ఈ లైవ్ ట్రేడింగ్ సెషన్ను నిర్వహించాలనుకున్నాయి. అయితే 22వ తేదీన ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా స్టాక్మార్కెట్లకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో 20వ తేదీని రెగ్యులర్ ట్రేడింగ్ డేగా ప్రకటించారు.