Share News

పసిడి దుకాణాలు కళకళ..

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:42 AM

కేంద్ర బడ్జెట్‌ పుణ్యమాని నగల షాపులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం ధర కొద్దిగా పెరిగినా.. బడ్జెట్‌ తర్వాత 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్‌) బంగారం ధర రూ.5,000 తగ్గి రూ.70,500 సమీపంలో ట్రేడవుతోంది.

పసిడి దుకాణాలు కళకళ..

సుంకం తగ్గింపే కారణం

మూడు రోజుల్లో రూ.5,000 తగ్గిన ధర

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ పుణ్యమాని నగల షాపులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం ధర కొద్దిగా పెరిగినా.. బడ్జెట్‌ తర్వాత 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్‌) బంగారం ధర రూ.5,000 తగ్గి రూ.70,500 సమీపంలో ట్రేడవుతోంది. దీంతో వచ్చిందే చాన్స్‌ అన్నట్టు కొనుగోలుదారులు పెద్దఎత్తున నగల దుకాణాలకు వస్తున్నారు. బడ్జెట్‌కు ముందు కిలో రూ.లక్షకు చేరువైన వెండి ధర.. ప్రస్తుతం రూ.84,000కు చేరువులో ట్రేడవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బంగారం, వెండిపై విధించే దిగుమతి సుంకాన్ని బడ్జెట్‌ లో 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఇది కొనుగోలుదారులతో పాటు నగల వ్యాపారులకూ కలిసి వస్తోంది.

దిగుమతి సుంకం తగ్గింపుతో ఆర్థిక మంత్రి పసిడి స్మగ్లింగ్‌కూ చాలా వరకు చెక్‌ పెట్టారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కిలో బంగారం దిగుమతిపై చెల్లించే దిగుమతి సుంకం రూ.9.82 లక్షల నుంచి రూ.3.93 లక్షలకు తగ్గింది. కాగా శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.50 పెరిగి రూ.70,700కు చేరింది. ఇదే సమయంలో కేజీ వెండి ధర రూ.400 పెరిగి రూ.84,400కు చేరింది.

దేశవ్యాప్తంగా ఒకే ధర !

ప్రస్తుతం బంగారం, వెండికి దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంది. దీనికి గుడ్‌బై చెప్పి ‘ఒకే దేశం, ఒకే ధర’ కోసం బులియన్‌ మార్కెట్‌ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వచ్చే నెల నుంచి పశ్చి మ బెంగాల్‌తో పాటు తూర్పు భారతం అంతా ఒకే ధర విధానం అమలు చేసేందుకు పరిశ్రమ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తామని ‘ఆలిండియా జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) చైర్మన్‌ సయామ్‌ మెహ్రా చెప్పారు.

పసిడి పీఎ్‌సయూలను ప్రైవేటీకరించండి: అనిల్‌ అగర్వాల్‌

ప్రస్తుతం మన దేశ పసిడి అవసరాల్లో 99.9 శాతానికి దిగుమతులే దిక్కు. ప్రభుత్వ రంగంలోని భారత్‌ గోల్డ్‌ మైన్స్‌, హుట్టి గోల్డ్‌ మైన్స్‌ కంపెనీలను ప్రైవేటీకరిస్తే ఉత్పత్తి భారీగా పెరిగి దిగుమతుల భారం చాలా వరకు తగ్గుతుందని వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ అన్నారు. ఇలా చేయడం వల్ల పసిడి ఉత్పత్తిలో భారత్‌.. ప్రముఖ దేశంగానూ అవతరిస్తుందన్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 06:42 AM