Share News

Modi 3.0 : మోదీ 3.0కి మరో సవాల్‌!

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:40 AM

కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాలేకపోయిన బీజేపీకి, ప్రధాని మోదీకి ఈ సారి పార్లమెంటరీ కమిటీల పదవుల విషయంలో పెద్ద సవాల్‌ ఎదురు కానుంది.

Modi 3.0 : మోదీ 3.0కి మరో సవాల్‌!

న్యూఢిల్లీ, జూన్‌ 12: కేంద్రంలో సొంతంగా అధికారంలోకి రాలేకపోయిన బీజేపీకి, ప్రధాని మోదీకి ఈ సారి పార్లమెంటరీ కమిటీల పదవుల విషయంలో పెద్ద సవాల్‌ ఎదురు కానుంది. కమిటీల్లో సింహభాగం ఇన్నాళ్లూ బీజేపీ చేతిలోనే ఉండేవి. ఇప్పుడు విపక్షాల సంఖ్యాబలం (234) పెరగడంతో కొన్ని కమిటీల సారథ్యం వాటికీ ఇవ్వక తప్పని పరిస్థితి. ఎన్డీయేలో ప్రస్తుతం బీజేపీ (240) తర్వాత పెద్ద పార్టీలైన టీడీపీ (16), జేడీయూ (12) కూడా కొన్ని కమిటీల చైర్మన్‌ పదవులు తప్పక ఆశిస్తాయి. కేంద్రప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించి పార్లమెంటులో మొత్తం 24 కమిటీలు ఉంటాయి. ప్రతి కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 21 మందిని లోక్‌సభ నుంచి స్పీకర్‌, 10 మందిని రాజ్యసభ నుంచి చైర్మన్‌ ఎంపిక చేస్తారు. ఇవిగాక ఎస్టిమేట్స్‌ కమిటీ, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ), సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ), ప్రివిలేజెస్‌ కమిటీ, హౌస్‌ కమిటీలు ఉంటాయి. మొత్తంగా 30 కమిటీలు ఉంటాయని.. వీటి చైర్మన్లను పార్లమెంటులో బలాబలాల ఆధారంగా ఆయా పార్టీల నుంచి ఎంపిక చేస్తారు. కీలక బిల్లులను చట్టంగా మార్చే క్రమంలో పార్లమెంటరీ కమిటీల పాత్ర కీలకం. బిల్లుల్లో లోపాలను ఎత్తిచూడం, సిఫారసులు చేయడం కమిటీల విధి. ఈ నేపథ్యంలో కీలక సంస్కరణలు, విధానాల కొనసాగింపునకు వీలుగా హోం, ఆర్థిక, ఐటీ, రక్షణ, విదేశీ వ్యవహారాల కమిటీల చైర్మన్‌ పదవులను బీజేపీ వదులుకోదని పార్లమెంటరీ వర్గాలు అంటున్నాయి. అయితే, సంకీర్ణ భాగస్వాములను కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని.. ముఖ్యంగా ఏపీ, బిహార్‌ రాష్ట్రాల అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని జాకీర్‌ హుస్సేన్‌ ఢిల్లీ కాలేజీ ప్రొఫెసర్‌ రవి రంజన్‌ తెలిపారు.

Updated Date - Jun 13 , 2024 | 04:41 AM