హనుమంతుడిగా సన్నీడియోల్
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:17 AM
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి రామాయణ గాథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి రామాయణ గాథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించే ఈ చిత్రం షూటింగ్ మార్చి నెలలో ప్రారంభమై మే నెలాఖరు వరకూ జరుగుతుంది. మొత్తం రామాయణ కథను మూడు భాగాలుగా ప్రేక్షకులకు అందించనున్నారు నితిన్ తివారీ. అయోధ్యలో రామమందిరం ప్రారంభం కావడంతో దేశమంతా ఇప్పుడు రామనామం ప్రతిధ్వనిస్తోంది. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో అందరి దృష్టీ ఇప్పుడు నితిన్ ‘రామాయణ్’ చిత్రం మీదే ఉంటుందనడంలో సందేహం లేదు. రామాయణ గాథలో మరో కీలకమైన పాత్ర హనుమంతుడు. ఈ పాత్రను ఎవరు పోషిస్తారా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు నటుడు దారాసింగ్ హనుమంతుడి పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఈ తరం నటుల్లో అటువంటి శక్తిమంతమైన పాత్రను ఎవరు పోషిస్తారా అని అందరూ అనుకుంటున్న తరుణంలో ‘నేను’ అంటూ ముందుకు వచ్చారు సన్నీడియోల్. ఇటువంటి పాత్రను పోషించే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది కనుక దాన్ని మిస్ చేసుకోకూడదని సన్నీ భావించి అంగీకరించినట్లు సమాచారం. మే నెలలో హనుమంతుడి గెటప్ వేసుకుని సన్నీ కెమెరా ముందుకు వస్తారట. 2025 దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది నిర్మాతల ఆలోచన.