Share News

NRI News: అమెరికాలో మహాత్ముడికి నివాళి అర్పించిన భారత అంధ క్రికెట్ టీం

ABN , Publish Date - Aug 28 , 2024 | 09:41 AM

అమెరికా పర్యటనలో(జులై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్టు” అమెరికా దేశం డాలస్‌లోనే అతి పెద్ద మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించారు.

NRI News: అమెరికాలో మహాత్ముడికి నివాళి అర్పించిన భారత అంధ క్రికెట్ టీం

డాలస్: అమెరికా పర్యటనలో(జులై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్టు” అమెరికా దేశం డాలస్‌లోనే అతి పెద్ద మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించారు. అనంతరం జాతిపిత గాంధీకి ఘన నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి తదితరులు వీరికి స్వాగతం పలికారు. బోస్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగో, డాలస్, లాస్ ఏంజిల్స్, సియాటెల్, బే ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా, ప్లేయర్స్ దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.


బాల్‌లో మువ్వలు..

అంధ క్రీడాకారుల్లో కొంతమంది పూర్తిగా అంధులు, మరికొంతమంది కొద్దిగా మాత్రమే చూడగలరు. వీరి క్రికెట్ బంతి సాధారణ బంతిలా కాకుండా దానిలో శబ్దంచేసే కొన్ని మువ్వలు ఉంటాయి. బౌలర్ బంతి విసిరినప్పుడు, ఆ బంతి చేసే శబ్దం ఆధారంగా ఎటువైపు ఎంత వేగంతో వస్తుందో అంచనావేసి బాట్స్ మాన్ దాన్ని కొడతాడు.

ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఛాంపియన్స్ గా నిలిచిన ఈ భారతజట్టులో విజయవాడకు చెందిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఈ క్రికెట్ టీం విదేశీ పర్యటనని ‘సుబ్బు కోట ఫౌండేషన్’ స్పాన్సర్ చేసి ఆర్థిక సాయం అందించింది. పర్యటిస్తున్న అన్ని నగరాలలో అంధులు క్రికెట్ ఎలా ఆడతారో తెలియజేస్తూ ఎగ్జిబిషన్ మ్యాచ్స్ ఆడుతూ విరాళాలు సేకరిస్తున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 09:41 AM