Share News

Viral: పెళ్లికి ఊరేగింపుగా వచ్చిన వరుడు అకస్మాత్తుగా అదృశ్యం..ఏం జరిగిందోనని వధువు కుటుంబం ఆరా తీస్తే..

ABN , Publish Date - Feb 03 , 2024 | 07:51 PM

వధువు కుటుంబం అతిథిమర్యాదు సరిగ్గా చేయలేదని అలిగి వెళ్లిపోయిన వరుడి కుటుంబానికి నచ్చచెప్పిన యూపీ పోలీసులు ఆ ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగేలా చేశారు. రాధానగర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral: పెళ్లికి ఊరేగింపుగా వచ్చిన వరుడు అకస్మాత్తుగా అదృశ్యం..ఏం జరిగిందోనని వధువు కుటుంబం ఆరా తీస్తే..

ఇంటర్నెట్ డెస్క్: కాసేపట్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగుతాయనంగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపుగా మండపానికి వచ్చిన వరుడు, అతడి కుటుంబసభ్యులు కనిపించకుండా పోయారు. దీంతో, కంగారు పడ్డ వధువు కుటుంబం ఏం జరిగిందో తెలిసి నివ్వెరపోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది. వారి జోక్యంతో ఆ ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగాయి. ఈలోపు జరిగిన తతంగమంతా ప్రత్యక్షంగా చూసిన అతిథులు నివ్వెరపోయారు.


ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) రాధానగర్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి స్థానికంగా ఉన్న యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి రోజున వరుడు, అతడి కుటుంబసభ్యులు ఊరేగింపుగా మండపానికి వచ్చారు. కానీ, తమకు అతిథిమర్యాదలు సరిగ్గా జరగలేదని భావించిన వరుడి కుటుంబం చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. వరుడి కుటుంబం కనిపించకపోవడంతో వధువు తరపు వారు దిమ్మెరపోయారు. అక్కడే ఉన్న బ్యాండ్‌మేళాం వాళ్లను ప్రశ్నించగా వరుడు తన కుటుంబంతో ఇంటికి వెళ్లిపోయినట్టు తెలిపారు. చివరకు వరుడు కుటుంబాన్ని కలిసి నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో, వారు చివరి ప్రయత్నంగా పోలీసులను ఆశ్రయించారు (Police play matchmakers for UP bride and groom after fight during marriage).


విషయం తెలిసి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వరుడి కుటుంబంతో సుదీర్ఘంగా చర్చలు జరిపి వారికి నచ్చజెప్పారు. వధువు కుటుంబంతో వారికి కావాల్సిన మర్యాదలన్నీ పద్ధతి ప్రకారం చేయించారు. పోలీసులు కనబడటంతో వరుడి కుటుంబం కూడా కాస్తమెత్తబడింది. దీంతో, మళ్లీ పెళ్లి బాజాలు మోగి ఆ జంట వివాహబంధంలో అడుగుపెట్టింది.

Updated Date - Feb 03 , 2024 | 07:59 PM