క్లీన్స్వీప్పై గురి
ABN , Publish Date - Sep 27 , 2024 | 06:29 AM
బంగ్లాదేశ్తో తొలి టెస్టును నాలుగు రోజుల్లోనే ఘనంగా ముగించిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. తాజాగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి సిరీ్సలో ఆఖరిదైన రెండో టెస్టు జరుగనుంది...
ఉదయం 9.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో..
జోరు మీదున్న భారత్
సమం కోసం బంగ్లాదేశ్
నేటి నుంచి తుది టెస్టు
కాన్పూర్: బంగ్లాదేశ్తో తొలి టెస్టును నాలుగు రోజుల్లోనే ఘనంగా ముగించిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. తాజాగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి సిరీ్సలో ఆఖరిదైన రెండో టెస్టు జరుగనుంది. మూడేళ్ల తర్వాత కాన్పూర్ వేదిక ఈ సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 1-0తో సిరీ్సలో ఆధిక్యంలో ఉన్న భారత్ నేటి మ్యాచ్లో క్లీన్స్వీ్ప లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. అదే జరిగి తే వరుసగా 18వ సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్టవుతుంది. మరోవైపు ఈ సిరీస్ ఆరంభానికి ముందు బంగ్లాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ భారత బౌ లర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు ఎలాంటి ప్రభావమూ చూపలేదు. దీంతో పాక్ను వైట్వాష్ చేసి ఊపు మీదున్న బంగ్లాను రోహిత్ సేన నేలకు దించింది. కానీ కాన్పూర్ టెస్టులో మాత్రం ఆతిథ్య జట్టుకు దీటుగా బదులివ్వాలనే కసితో ఉంది. తద్వారా భారత్పై తొలి విజయంతో పాటు సిరీ్సను సమం చేయాలనుకుంటోంది.
విరాట్, రోహిత్పైనే దృష్టి: చెన్నై టెస్టులో అశ్విన్, జడేజా, పంత్, గిల్ విశేషంగా రాణించినా టాపార్డర్ కలిసికట్టుగా ఆడలేకపోయింది. ఓపెనర్గా జైస్వాల్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ మాత్రం దారుణంగా విఫ లం కావడం టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళనపరుస్తోం ది. సుదీర్ఘ సీజన్ ముందుండడంతో ఈ ఇద్దరు వెటరన్స్ తమ బ్యాట్లను ఝుళిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే కేఎల్ రాహుల్ తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇక గ్రీన్పార్క్ వికెట్ సహజంగానే స్పిన్కు అనుకూలిస్తుంటుంది. దీంతో భారత జట్టు తుది కూర్పులో మార్పులు తప్పవు. చెన్నై మ్యాచ్కు ముగ్గురు పేసర్లు అవసరమైనా.. ఇక్కడ మాత్రం ఇద్దరితోనే వెళ్లాలనుకుంటోంది. అందుకే పేసర్ ఆకాశ్ దీప్నకు విశ్రాంతినిచ్చి కుల్దీప్ లేక అక్షర్లలో ఒకరిని ఆడించనున్నారు. అలాగే మరో ఎనిమిది టెస్టులుండడంతో బుమ్రాకు విశ్రాంతినిచ్చే విషయాన్నీ తోసిపుచ్చలేం. ఏడాదిన్నర కాలంగా కుల్దీప్ అద్భుతంగా రాణిస్తుండడంతో కెప్టెన్, కోచ్ గంభీర్ అతడి వైపే మొగ్గు చూపవచ్చు. 2021లో ఇక్కడ జరిగిన చివరి టెస్టులో భారత్ అశ్విన్, జడేజా, అక్షర్లతో బరిలోకి దిగింది.
షకీబ్ సందేహమే: తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందిపడిన బంగ్లాకు తాజా టెస్టు ఆరంభానికి ముందే తడబాటు తప్పేట్టు లేదు. షకీబ్ అల్ హసన్ వేలి గాయంతో బాధపడుతున్నాడు. అయితే కోచ్ మాత్రం అతను బరిలోకి దిగుతాడని చెబుతున్నాడు. బ్యాటింగ్లో కెప్టెన్ షంటోపైనే భారం పడుతోంది. మోమినుల్, ముష్ఫికర్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ విఫలమయ్యారు. ఇక బంగ్లా కూడా మూడో స్పిన్నర్గా తైజుల్ ఇస్లాంను బరిలోకి దింపాలనుకుంటోంది. టెస్టుల్లో బంగ్లా బలం వారి స్పిన్నర్లే. ఇప్పుడు అదే బలంతో భారత్పై గెలుపు రుచి చూడాలనుకుంటోంది.
జట్లు (అంచనా)
భారత్: జైస్వాల్, రోహిత్ (కెప్టెన్), గిల్, విరాట్, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, కుల్దీప్, ఆకాశ్/బుమ్రా, సిరాజ్.
బంగ్లాదేశ్: షాద్మన్, జకీర్ హసన్, షంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముఫ్ఫికర్, షకీబ్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్, హసన్ మహమూద్, టస్కిన్/నహీద్, తైజుల్.
పిచ్
కాన్పూర్ వికెట్ సమతూకంతో ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నాడు. తొలి రోజు బౌన్స్తో పేసర్లు లాభపడనున్నారు. అయితే మ్యాచ్ సాగుతున్నకొద్దీ స్పిన్నర్లదే ఆధిక్యం కనిపించనుంది. ఇక బ్యాటర్లకు కూడా అనుకూలం కావడంతో భారీ స్కోర్లను ఆశించవచ్చు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 370.
వరుణుడితో ఇబ్బందే
భారత్-బంగ్లా రెండో టెస్టుకు తొలి మూడు రోజులు ఉరుములతో కూడిన వర్షం ఆటంకం కలిగించే అవకాశాలున్నాయి. గురువారం ఇక్కడ కురిసిన భారీ వర్షానికి బంగ్లా ప్రాక్టీస్ కూడా చేయలేకపోయింది. అయితే ఆధునిక డ్రైనేజి వ్యవస్థ ఉన్నందున త్వరగానే పరిస్థితులను చక్కదిద్దగలమని స్టేడియం మేనేజర్ సంజయ్ కపూర్ చెబుతున్నాడు. చివరి మూడు రోజులు మాత్రం వరుణుడి నుంచి ఎలాంటి ముప్పూ లేదట.
2
టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్లో చేరేందుకు జడేజా మరో వికెట్ దూరంలో ఉన్నాడు. అదే జరిగితే సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలో అత్యంత వేగంగా (74 టెస్టుల్లో) 300 వికెట్లు, 3000+ పరుగులు సాధించిన రెండో ప్లేయర్ అవుతాడు. ఇయాన్ బోథమ్ (72 టెస్టులు) టాప్లో ఉన్నాడు.