మంధాన శతక గర్జన
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:58 AM
డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన (127 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 117) శతకంతోపాటు స్పిన్నర్లు ఆశా శోభన (8.4-2-21-4), దీప్తి శర్మ (6-0-10-2) తిప్పేయడంతో.. దక్షిణాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీ్సను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది...
ప్రపంచకప్లో నేటి మ్యాచ్లు
బంగ్లాదేశ్ X నేపాల్ (ఉ.5. గం.)
శ్రీలంక X నెదర్లాండ్స్ (ఉ.6. గం.)
న్యూజిలాండ్ X పీఎన్జీ (రా.8. గం.)
శోభనకు 4 వికెట్లు ఫ భారత్దే తొలి వన్డే
143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు
బెంగళూరు: డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన (127 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 117) శతకంతోపాటు స్పిన్నర్లు ఆశా శోభన (8.4-2-21-4), దీప్తి శర్మ (6-0-10-2) తిప్పేయడంతో.. దక్షిణాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీ్సను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో హర్మన్ సేన 143 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 265/8 స్కోరు చేసింది. దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31 నాటౌట్) రాణించారు. అయబొంగ 3, మసాబటా క్లాస్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో సౌతాఫ్రికా 37.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ ఆశా శోభన సంచలన ప్రదర్శనతో అరంగేట్ర మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకుంది. రేణుక, పూజ, రాధా యాదవ్ తలా వికెట్ తీశారు. స్మృతి మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
ఆదినుంచే తడబాటు: సఫారీల ఇన్నింగ్స్లో కెప్టెన్ లారా వొల్వార్ట్ (4)ను రేణుక మొదటి ఓవర్లోనే అవుట్ చేసి షాకిచ్చింది. అనెక్ బాష్ (5), తంజిమ్ బ్రిట్స్ (18) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే, సునె లుస్ (33), మరిజానె కాప్ (24) నాలుగో వికెట్కు 39 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, కాప్ను శోభన బోల్తా కొట్టించడంతో జట్టు 72/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ వెంటనే డ్రెక్సన్ (1)ను జెమీమా రనౌట్ చేయగా, క్రీజులో పాతుకుపోయిన లుస్ను దీప్తి ఎల్బీ చేయడంతో సౌతాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. సినాలో జఫ్టా (27 నాటౌట్) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. క్లాస్ (1), మ్లబా (0), కకా (0)ను అవుట్ చేసిన శోభన.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు తెరదించింది.
టాప్ విలవిల: టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనా.. స్మృతి మంధాన పోరాటంతో భారత్ సవాల్ విసరగలిగే స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా ఆరంభంలో తడబడింది. షఫాలీ (7), హేమలత (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. హర్మన్ప్రీత్ (10), జెమీమా (17), రిచా ఘోష్ (3) కూడా పేలవ ప్రదర్శన చేయడంతో 22 ఓవర్లలో భారత్ 99/5 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో దీప్తి శర్మ జతగా స్మృతి ఆరో వికెట్కు 81 రన్స్ జోడించి జట్టును ఆదుకొంది. దీప్తిని కకా అవుట్ చేసినా.. ఆ తర్వాత మంధానకు పూజ చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ ఏడో వికెట్కు వేగంగా 58 రన్స్ జతచేశారు. సెంచరీ పూర్తి చేసుకొన్న మంధానాను మసాబటా పెవిలియన్ చేర్చినా.. ఽపూజ జట్టు స్కోరును 260 మార్క్ దాటించింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 265/8 (మంధాన 117, దీప్తి 37; కకా 3/47, క్లాస్ 2/51).
సౌతాఫ్రికా: 37.4 ఓవర్లలో 122 ఆలౌట్ (లుస్ 33, కాప్ 24; ఆశా శోభన 4/21, దీప్తి 2/10).
6
మంధానకు ఇది వన్డేల్లో ఆరో సెంచరీ. కాగా, స్వదేశంలో మాత్రం ఇదే మొదటిది.