Share News

Indian team selection : ఏ సిరీస్‌ ఆడాలనేది.. ఇకపై ఆటగాళ్ల ఇష్టం కాదు

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:33 AM

భారత జట్టు ఎంపిక, భవిష్య ప్రణాళికలపై కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ ఏకాభిప్రాయంతో ఉన్నారు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్‌ టీమిండియాతో ప్రయాణం శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీ్‌సతో ప్రారంభం కానుంది.

Indian team selection : ఏ సిరీస్‌ ఆడాలనేది.. ఇకపై ఆటగాళ్ల ఇష్టం కాదు

మీడియాతో కోచ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌

ఫిట్‌గా ఉంటే అన్నీ ఆడాల్సిందే!

ఫిట్‌నెస్సే హార్దిక్‌ సమస్య

అందుకే సూర్యకు సారథ్యం

ముంబై: భారత జట్టు ఎంపిక, భవిష్య ప్రణాళికలపై కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ ఏకాభిప్రాయంతో ఉన్నారు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్‌ టీమిండియాతో ప్రయాణం శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీ్‌సతో ప్రారంభం కానుంది. ఈనెల 27న మొదలయ్యే ఈ టూర్‌ను పురస్కరించుకొని గంభీర్‌, అగార్కర్‌ సోమవారం మీడియాతో సుదీర్ఘంగా ముచ్చటించారు. శ్రీలంకతో సిరీ్‌సకు జట్టు ఎంపికపై వారు వివరణ ఇచ్చారు. ఇకనుంచి ఆటగాళ్లు తమ ఇష్టమొచ్చినట్టు ఫలానా సిరీస్‌లో తాను ఆడబోనని చెప్పడం కుదరదని తేల్చిచెప్పారు. బ్యాటర్లు, బౌలర్లకు వర్క్‌లోడ్‌ విభిన్నంగా ఉంటుందని వారు తెలిపారు. ‘బుమ్రాలాంటి బౌలర్‌ విషయంలో వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ అత్యంత కీలకం. అందువల్ల కొన్ని సిరీ్‌సలకు అతడికి విశ్రాంతి ఇస్తాం. ఒకవేళ బ్యాటర్‌ ఎవరైనా మంచి ఫామ్‌లో ఉంటే మాత్రం అతడు అన్ని మ్యాచ్‌లూ ఆడాల్సిందే’ అని గంభీర్‌ తేల్చి చెప్పాడు. ‘రోహిత్‌, విరాట్‌ ఇకపై రెండు ఫార్మాట్లే ఆడనున్నారు. అందువల్ల వారిద్దరూ సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతారు’ అని వివరించాడు. ఫిట్‌నెస్‌ సహకరిస్తే వారిద్దరూ 2027 వన్డే వరల్డ్‌ కప్‌లోనూ ఆడతారన్నాడు.

హార్దిక్‌కు ఫిట్‌నెస్‌ సమస్యలు..: శ్రీలంకతో సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యాను కాకుండా సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై వివరణ ఇచ్చారు. దీనిపై గంభీర్‌ మాట్లాడుతూ.. ‘కెప్టెన్‌ అంటే అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడాలి’ అని వ్యాఖ్యానించాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతో గతంలో హార్దిక్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కేఎల్‌ రాహుల్‌ అద్భుత వన్డే ఆటగాడని అగార్కర్‌ చెప్పాడు. అందుకే శాంసన్‌ బదులు శ్రీలంక టూర్‌కు రాహుల్‌కు చోటు కల్పించామన్నాడు. ‘రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు ఆడాల్సి ఉన్నది. వాటిల్లో రాహుల్‌, పంత్‌ కీలకం. అందువల్ల లంక టూర్‌కు రెండో కీపర్‌గా పంత్‌ను తీసుకున్నాం’ అని అగార్కర్‌ వివరించాడు.

జడేజాను తప్పించలేదు..: ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను వన్డే జట్టునుంచి తప్పించలేదని, అతనికి విశ్రాంతినిచ్చామని అగార్కర్‌ తెలిపాడు. శ్రీలంకతో చిన్నపాటి సిరీ్‌సకు వన్డే జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉండడం అర్థంలేనిదన్నాడు. ‘వచ్చే సెప్టెంబరు 19 నుంచి టీమిండియా 10 టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. జడేజా మాకు ముఖ్యమైన ఆటగాడు. అందుకే అతడికి విశ్రాంతినిచ్చాం’ అని గంభీర్‌ చెప్పాడు. టెస్ట్‌ సిరీస్‌ నాటికి పేసర్‌ షమి జట్టులోకి వచ్చే అవకాశముందన్నాడు.

కోహ్లీతో బంధంపై..

గంభీర్‌కు, విరాట్‌ కోహ్లీకి మధ్య సన్నిహిత సంబంధాలు లేవన్నది తెలిసిందే. గత ఐపీఎల్‌లో వారిద్దరి మధ్య గొడవ ఆ విషయాన్ని మరింత బలపరిచింది. కానీ కోహ్లీతో సంబంధంపై గౌతీ తనదైన రీతిలో బదులిచ్చాడు. ‘టీఆర్‌పీని పెంచడం కోసం కోహ్లీతో నా సంబంధం ఉండదు. అయినా మా ఇద్దరి మధ్య సంబంధం ప్రజలకోసం కాదు. మా ఇద్దరి మధ్య బంధం ఇద్దరు పరిణతి చెందిన వ్యక్తుల మధ్య సంబంధంలాంటిది’ అని చెప్పాడు.

సహాయకులు నాయర్‌, డష్కాటే

ఆల్‌రౌండర్లు అభిషేక్‌ నాయర్‌, ర్యాన్‌ డష్కాటే సహాయ కోచ్‌లగా నియమితులయ్యారని గంభీర్‌ ధ్రువీకరించాడు. వారిద్దరితో తాను చాలాకాలంగా కలిసి పనిచేస్తున్నానని గుర్తు చేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా గంభీర్‌..నాయర్‌, డెష్కాటేతో కలిసి పని చేశాడు.

Updated Date - Jul 23 , 2024 | 08:52 AM