Share News

పారా హుషార్‌

ABN , Publish Date - Aug 26 , 2024 | 05:36 AM

రెండు వారాల కిందట ప్రపంచ అతిపెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌కు తెరపడింది. మరో క్రీడా సంరంభానికి ఇంకో రెండు రోజుల్లో తెరలేవనుంది. దాంతో పదిరోజులకుపైగా పారిస్‌ నగరంలో సందడే..సందడి...

పారా హుషార్‌

మరో రెండు రోజుల్లో పారాలింపిక్స్‌

25 పతకాలు లక్ష్యంగా భారత్‌

రెండు వారాల కిందట ప్రపంచ అతిపెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌కు తెరపడింది. మరో క్రీడా సంరంభానికి ఇంకో రెండు రోజుల్లో తెరలేవనుంది. దాంతో పదిరోజులకుపైగా పారిస్‌ నగరంలో సందడే..సందడి..17వ పారాలింపిక్స్‌ ఈనెల 28 నుంచి వచ్చేనెల ఎనిమిది వరకు ప్రపంచ క్రీడా ప్రేమికులను అలరించనున్నాయి. ఇక ఈ విశ్వ క్రీడల్లో భారత్‌ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల బరిలో దిగుతున్నారు. గత టోక్యో పారాలింపిక్స్‌లో ఏకంగా 19 పతకాలు సొంతం చేసుకోవడంతో భారత అథ్లెట్ల ఆత్మవిశ్వాసం రెండింతలైంది. అంతకుముందు లండన్‌ (2012) గేమ్స్‌లో ఒకే ఒక పతకంతో సరిపెట్టుకున్న మనోళ్లు.. రియో (2016)లో మరింత మెరుగైన ప్రదర్శనతో నాలుగు పతకాలు గెలిచారు. టోక్యోలో అవి దాదాపు అయిదింతలకు చేరడం భారత అథ్లెట్ల అద్భుత ప్రతిభకు అద్దం పట్టింది. ఈనేపథ్యంలో క్రీడాకారులంతా స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే పారి్‌సలో 25 పతకాలు లభించవచ్చని అంచనా వేస్తున్నారు. 1968లో భారత్‌ తొలిసారి పారాలింపిక్స్‌లో తలపడింది. అప్పటినుంచి 2016 క్రీడల వరకు మన అథ్లెట్లు సాధించిన మొత్తం పతకాల సంఖ్య 12 కావడం గమనార్హం.


రియో క్రీడల్లో కేవలం 19 మంది అథ్లెట్లే పాల్గొన్నారు. టోక్యో పారాలింపిక్స్‌కొచ్చేసరికి అథ్లెట్ల సంఖ్య 54కి చేరింది. పారి్‌సలో సంఖ్యాపరంగా రికార్డు స్థాయిలో మనోళ్లు పోటీపడుతున్నారు. ఈసారి భారీ బృందంతో బరిలో దిగడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. పారా విశ్వక్రీడలను సీరియ్‌సగా తీసుకోవడం అందులో మొదటిది. పారా అథ్లెట్లతో శక్తిసామర్థ్యాలను గుర్తెరగడం రెండోది.

స్ఫూర్తి నింపుతున్న ఆ అథ్లెట్లు..

పారి్‌సలోనూ వరల్డ్‌ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం కొల్లగొట్టాలని జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. నీరజ్‌ చోప్రా స్ఫూర్తిగా తాను పారి్‌సలో 80మీ. ధ్యేయంగా పెట్టుకున్నట్టు సుమిత్‌ చెప్పాడు. ఇక, షూటింగ్‌లో అవనీ లేఖార, మనీష్‌ నర్వాల్‌ హాట్‌ ఫేవరెట్లుగా పోటీపడు తున్నారు. టోక్యోలో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన అవని ఈసారి టైటిల్‌ నిలబెట్టుకోగలనన్న ధీమాతో బరిలోకి దిగుతోంది. మరోవైపు టేబుల్‌ టెన్ని్‌సలో భవినా పటేల్‌పై అంచనాలున్నాయి.


‘టాప్స్‌’, కార్పొరేట్‌ స్పాన్సర్‌షిప్‌

ప్రధాన అథ్లెట్లతోపాటు టార్గెట్‌ ఒలింపిక్స్‌ పోడియం స్కీం (టాప్స్‌)లో చోటు కల్పించడం పారా అథ్లెట్లకు మరింత కలిసొచ్చింది. అలాగే కార్పొరేట్‌ సంస్థలు కూడా వారిని స్పాన్సర్‌ చేసేందుకు ముందుకొస్తున్నాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా పారా అథ్లెట్లు శిక్షణ కొనసాగించడంతోపాటు అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొనగలుగుతున్నారు. జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర ఝఝారియా 2004లో ఏథెన్స్‌ విశ్వక్రీడల్లో స్వర్ణ పతకం గెలవడం దేశ పారా అథ్లెటిక్స్‌లో అనూహ్య మార్పులకు నాంది పలికింది. భారత పారాలింపిక్‌ కమిటీ (పీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. అప్పటి వరకు శిక్షణ, సదుపాయాల కొరత ఎదుర్కొన్న పారా అథ్లెట్లు..పీసీఐకి గుర్తింపు ఇచ్చాక ఆ కష్టాలకు తెరపడ్డాయి. 2019-21 మధ్య పారా క్రీడల సౌకర్యాలకు కేంద్రం రూ. 8.2 కోట్లు ఖర్చు పెట్టింది. పారా అథ్లెట్లు ‘టాప్స్‌’తో ఎంతో లబ్ధి పొందారు. సుమిత్‌ అంటిల్‌ కృత్రిమ కాలుకోసం రూ. ఏడు లక్షలు వెచ్చించడంతోపాటు నీరజ్‌ చోప్రాతో కలిసి ప్రాక్టీస్‌ చేసే అవకాశం కల్పించింది. ట్యునీసియా, ఫిన్లాండ్‌లలో అంటిల్‌ శిక్షణ పొందాడు. ప్రస్తుతం దేశంలో పారా క్రీడలకు పెరిగిన ప్రాధాన్యం రీత్యా చూస్తే పారి్‌సలో మన పతకాల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు లేకపోలేదు. పారి్‌సలో 25కిపైగా పతకాలు లభించే చాన్సుందని పీసీఐ చీఫ్‌ దేవేంద్ర ఝఝారియా అంచనా వేస్తున్నాడు.

పారిస్‌ పయనమైన బ్యాడ్మింటన్‌, జూడో, తైక్వాండో క్రీడాకారులు

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - Aug 26 , 2024 | 05:36 AM