Share News

‘టాప్‌’ లేపిన సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:35 AM

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో హాట్‌ ఫేవరెట్‌ హోదాకు న్యాయం చేస్తూ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జోడీ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించిన ఈ భారత జంట.. గ్రూప్‌-సిలో టాపర్‌ను నిర్ణయించే కీలకమ్యాచ్‌లోనూ అదరగొట్టింది. మంగళవారం జరిగిన

‘టాప్‌’ లేపిన సాత్విక్‌ జోడీ

అశ్విని జంట ఇంటికి..

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో హాట్‌ ఫేవరెట్‌ హోదాకు న్యాయం చేస్తూ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి జోడీ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించిన ఈ భారత జంట.. గ్రూప్‌-సిలో టాపర్‌ను నిర్ణయించే కీలకమ్యాచ్‌లోనూ అదరగొట్టింది. మంగళవారం జరిగిన పోరులో మూడోసీడ్‌ సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-13, 21-13తో ఇండోనేసియాకు చెందిన మహ్మద్‌ అర్డియాంటో-ఫజర్‌ అల్ఫియాన్‌ను ఓడించింది. దీంతో ఓటమన్నదే లేని సాత్విక్‌ ద్వయం గ్రూప్‌-సిలో టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన సాత్విక్‌ జంట.. సోమవారం ఆడాల్సిన రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థి జోడీ గాయంతో తప్పుకోవడంతో క్వార్టర్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఇక మూడో మ్యాచ్‌లోనూ నెగ్గడంతో భారత ద్వయం ఓటమన్నదే లేకుండా తమ గ్రూప్‌లో టాప్‌ స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్‌-సి నుంచి ఇండోనేసియా జోడీ రియాన్‌-ఫజర్‌ రెండోస్థానంతో క్వార్టర్స్‌ చేరింది. క్వార్టర్స్‌లో ఎవరితో ఆడతారనేది బుధవారం తేలనుంది. మహిళల డబుల్స్‌లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో పోరాటం ముగిసింది. గ్రూప్‌-సిలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడి నాకౌట్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో అశ్విని జోడీ 15-21, 10-21తో ఆస్ట్రేలియా జంట సెత్యానా-ఏంజెలా చేతిలో ఓటమి పాలైంది.

Updated Date - Jul 31 , 2024 | 06:35 AM