ఉబెర్ కప్ నుంచి వైదొలగిన సింధు
ABN , Publish Date - Apr 05 , 2024 | 02:03 AM
డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. ఉబెర్ కప్ జట్టు నుంచి తప్పుకొంది. ఆమెతోపాటు డబుల్స్లో గాయత్రి పుల్లెల, అశ్విని పొన్నప్ప జంటలు కూడా టోర్నీకి దూరమయ్యాయి...
గాయత్రి, అశ్విని జోడీలు కూడా
న్యూఢిల్లీ: డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు.. ఉబెర్ కప్ జట్టు నుంచి తప్పుకొంది. ఆమెతోపాటు డబుల్స్లో గాయత్రి పుల్లెల, అశ్విని పొన్నప్ప జంటలు కూడా టోర్నీకి దూరమయ్యాయి. అయితే, థామ్సకప్ డిఫెండింగ్ చాంప్ అయిన భారత పురుషుల జట్టు బలమైన బృందంతో బరిలోకి దిగుతోంది. చైనాలోని చెంగ్డూలో ఈనెల 27 నుంచి జరిగే థామస్, ఉబెర్ కప్ కోసం భారత జట్లను గురువారం ప్రకటించారు. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన సింధు ఫామ్ కోసం తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కొంత విశ్రాంతితోపాటు రానున్న టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనతో పారిస్ టికెట్ను ఖరారు చేసుకోవాలనుకొంటోంది. ట్రీసా జాలీ-గాయత్రి, అశ్విని-తనీషా జంటలు కూడా ఇదే ఉద్దేశంతో టోర్నీకి దూరమయ్యాయి.
థామస్ కప్ జట్టు: హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జ్; డబుల్స్లో సాత్విక్-చిరాగ్, అర్జున్-ధ్రువ్, సాయి ప్రతీక్ (బ్యాకప్).
ఉబెర్ కప్: అన్మోల్, తన్వీ శర్మ, అస్మిత, ఇస్రానీ; డబుల్స్లో శృతి మిశ్రా, ప్రియ కొంజెంగబమ్, సిమ్రన్ సింగ్, రితిక థాకర్.