Share News

మనసు మార్చుకుందా?

ABN , Publish Date - Aug 17 , 2024 | 06:16 AM

కేవలం 100 గ్రాములు అధిక బరువుందనే కారణంతో పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కిలోల విభాగం ఫైనల్‌కు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ను అనర్హురాలిగా ప్రకటించడంతో దేశం యావత్తు నివ్వెరపోయింది. క్రీడల నిర్వాహకుల నిర్ణయాన్ని

మనసు మార్చుకుందా?

కెరీర్‌ కొనసాగింపుపై వినేశ్‌ పరోక్ష సంకేతం

న్యూఢిల్లీ: కేవలం 100 గ్రాములు అధిక బరువుందనే కారణంతో పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కిలోల విభాగం ఫైనల్‌కు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ను అనర్హురాలిగా ప్రకటించడంతో దేశం యావత్తు నివ్వెరపోయింది. క్రీడల నిర్వాహకుల నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయింది. మనకే ఇంత బాధ ఉంటే రెజ్లర్‌ వినేశ్‌కు ఇంకా ఎంత వేదన ఉంటుందో కదా! అందివచ్చిన ఒలింపిక్‌ పతకం చేజారడంతో మనసు వికలమైన ఫొగట్‌ అనూహ్యంగా తన కెరీర్‌కు వీడ్కోలు పలికింది. తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఫ్యాన్స్‌, సహచర క్రీడాకారులు వినేశ్‌ను కోరారు కూడా. పైగా..తన అనర్హతను సవాలు చేస్తూ..క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానా (కా్‌స)న్ని ఆశ్రయించిన వినేశ్‌కు అక్కడా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో పోరాటానికి మారుపేరైన 29 ఏళ్ల ఫొగట్‌ తన మనసు మార్చుకున్నట్టే కనిపిస్తోంది. మరో రెండు ఒలింపిక్స్‌లో తలపడాలనే ఆకాంక్షను పరోక్షంగా వ్యక్తీకరించింది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఆమె శుక్రవారం ఉద్వేగంతో కూడిన సుదీర్ఘ పోస్టు చేసింది. ‘విభిన్న పరిస్థితుల నేపథ్యంలో 2032 వరకు నేను ఆడగలననే అనిపిస్తోంది. నాలో పోరాటం, నాలో రెజ్లింగ్‌ ఎప్పుడూ ఉంటుంది. నా భవిష్యత్‌ ఎలా ఉంటుందో, ఆ ప్రయాణంలో ఏమి జరుగుతుందో చెప్పలేను. కానీ నేను నమ్మిన, నాకు సరైనదే అనిపించిన దానికోసం పోరాటాన్ని ఎప్పుడూ ఆపను’ అని తేల్చి చెప్పింది. ‘మనుగడ కోసం పోరాటం ఎన్నో పాఠాలు నేర్పింది. నాన్నను చిన్నతనంలోనే కోల్పోయా. అమ్మ కేన్సర్‌ బారిన పడింది. అయినా ఆమె ఎప్పుడూ జీవన పోరాటం ఆపలేదు. పోరాడేతత్వం అమ్మనుంచే అలవడింది’ అని కష్టాలమయమైన తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. చిన్న తనంలో.. పొడవైన జుత్తు కోసం ఎన్నో కలలు కన్నానని చెప్పింది. తన కెరీర్‌ ఎదుగుదలకు ఎంతో తోడ్పడిన కోచ్‌లు, ట్రెయినర్‌, డాక్టర్‌ పార్థీవాలాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. భర్త సోమ్‌వీర్‌ తనకు నిరంతరం రక్షణ కవచంలా నిలిచాడని తెలిపింది.

Updated Date - Aug 17 , 2024 | 06:16 AM