Share News

Under-19 World Cup : కుర్రాళ్లు కేక

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:32 AM

ఉత్కంఠభరితంగా సాగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ తొలి సెమీస్‌లో యువ భారత్‌ అదరగొట్టింది. ఓ దశలో ఓటమి తప్పదా? అనిపించినా.. సచిన్‌ దాస్‌ (95 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 96), కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (124 బంతుల్లో 6 ఫోర్లతో 81) అసమాన ఆటతీరుతో అండగా నిలిచారు. ఫలితంగా..

Under-19 World Cup : కుర్రాళ్లు కేక

అండర్‌-19 వరల్డ్‌కప్‌

వరుసగా ఐదోసారి ఫైనల్‌కు భారత్‌

సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 2 వికెట్లతో గెలుపు

సచిన్‌, కెప్టెన్‌ ఉదయ్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌

ఆరో టైటిల్‌పై కన్నేసిన భారత యువ క్రికెటర్లు అంచనాలకు తగ్గట్టే చెలరేగుతున్నారు. దక్షిణాఫ్రికాపై సెమీస్‌లో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా.. ఒత్తిడిని తట్టుకుంటూ నిలిచి గెలిచారు. కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ ఫామ్‌ నిరూపించుకోగా.. సచిన్‌ దాస్‌ వరుసగా రెండో శతకాన్ని తృటిలో కోల్పోయాడు. అయితేనేం.. మెరుపు ఆటతో జట్టు అద్భుత విజయం సాధించేందుకు తోడ్పడ్డాడు. తద్వారా అండర్‌-19 వరల్డ్‌కప్‌లో వరుసగా ఆరో విజయంతో భారత్‌ తుది పోరుకు చేరింది.

బెనోని: ఉత్కంఠభరితంగా సాగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ తొలి సెమీస్‌లో యువ భారత్‌ అదరగొట్టింది. ఓ దశలో ఓటమి తప్పదా? అనిపించినా.. సచిన్‌ దాస్‌ (95 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 96), కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (124 బంతుల్లో 6 ఫోర్లతో 81) అసమాన ఆటతీరుతో అండగా నిలిచారు. ఫలితంగా.. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్‌ ప్రిటోరియస్‌ (76), రిచర్డ్‌ (64) అర్ధసెంచరీలు చేశారు. రాజ్‌ లింబానికి మూడు, ముషీర్‌కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో భారత్‌ 48.5 ఓవర్లలో 8 వికెట్లకు 248 పరుగులు చేసి గెలిచింది. మఫాక, లూస్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఉదయ్‌ నిలిచాడు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో భారత్‌ ఈనెల 11న ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

32 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయినా..: 245 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌కు టోర్నీలో తొలిసారిగా గట్టిపోటీనే ఎదురైంది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ ఆదర్శ్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత పేసర్‌ లూస్‌ మరింతగా దెబ్బతీశాడు. భీకర ఫామ్‌లో ఉన్న ముషీర్‌ ఖాన్‌ (4)ను నాలుగో ఓవర్‌లో అవుట్‌ చేయగా, కాసేపటికే వరుస ఓవర్లలో అర్షిన్‌ (12), మోలియా (5)ల వికెట్లు పడగొట్టాడు. అప్పటికి జట్టు స్కోరు 32/4 మాత్రమే. ఈ దశలో జట్టుకు ఓటమి తప్పదా అనిపించింది. కానీ పరుగులు రావడం కష్టంగా మారిన ఈ పిచ్‌పై సచిన్‌ దాస్‌, ఉదయ్‌ సమయోచితంగా ఆడారు. ఉదయ్‌ నిదానంగా ఆడినా మరో ఎండ్‌లో సచిన్‌ చెలరేగాడు. చక్కటి సమయన్వయంతో రిస్కీ షాట్లకు వెళ్లకుండా ఈ జోడీ జట్టును విజయంపైపు నడిపించింది. 47 బంతుల్లోనే సచిన్‌ అర్ధసెంచరీ సాధించాడు. అయితే 40వ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన తను సెంచరీకి అతి చేరువలో వచ్చాడు. కానీ మరో నాలుగు పరుగుల దూరంలో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే ఐదో వికెట్‌కు 171 పరుగులు జత చేరడం విశేషం. ఇక విజయానికి మరో 19 పరుగుల దూరంలో అవనీశ్‌ (10), అభిషేక్‌ (0) అవుట్‌ కావడంతో ఉత్కంఠ పెరిగింది. అప్పటికి 16 బంతుల్లో 18 రన్స్‌ కావాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లున్నాయి. అయితే 48వ ఓవర్‌లో రాజ్‌ లింబాని (13 నాటౌట్‌) అలవోకగా సిక్సర్‌ బాదేసి ఒత్తిడి తగ్గించాడు. 12 బంతుల్లో 9 రన్స్‌ అవసరమైన వేళ 49వ ఓవర్‌లో ఉదయ్‌ ఫోర్‌ కొట్టి రనౌట్‌ కాగా, లింబాని మరో ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

సంక్షిప్త స్కోర్లు

దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 244/7 (ప్రిటోరియస్‌ 76, రిచర్డ్‌ సెలెట్‌స్వేన్‌ 64; లింబాని 3/60, ముషీర్‌ ఖాన్‌ 2/43).

భారత్‌: 48.5 ఓవర్లలో 248/8. (సచిన్‌ దాస్‌ 96, ఉదయ్‌ 81; మఫాకా 3/32, లూస్‌ 3/37).

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరడం ఓవరాల్‌గా ఇది తొమ్మిదోసారి. ఇక, రికార్డు స్థాయిలో ఐదుసార్లు విజేతగా నిలిచింది.

Updated Date - Feb 07 , 2024 | 08:22 AM