Share News

వినేశ్‌, బజ్‌రంగ్‌వల్లే.. ఉద్యమ ప్రతిష్ఠ దెబ్బతిన్నది

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:23 AM

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌కు వ్యతిరేకంగా స్టార్‌ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై సాక్షి మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల ఎంపిక...

వినేశ్‌, బజ్‌రంగ్‌వల్లే.. ఉద్యమ ప్రతిష్ఠ దెబ్బతిన్నది

వారిద్దరూ స్వార్థంగా ఆలోచించారు

బయోగ్రఫీలో సంచలన విషయాలు వెల్లడించిన సాక్షి మాలిక్‌

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌కు వ్యతిరేకంగా స్టార్‌ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై సాక్షి మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల ఎంపిక పోటీలనుంచి వినేశ్‌ ఫొగట్‌, బజ్‌రంగ్‌ పూనియా మినహాయింపు పొందడాన్ని ఆమె తప్పుబట్టింది. వారిద్దరి నిర్ణయం వల్ల ఉద్యమ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని అభిప్రాయపడింది. వ్యక్తిగత లబ్ధికోసం ఉద్యమం చేశారన్న అప్రతిష్ఠ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన చెందింది. ఈమేరకు తన ఆటోబయోగ్రఫీ ‘విట్‌నె్‌స’లో సాక్షి మాలిక్‌ తన అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా దేశ మేటి రెజ్లర్లు వినేశ్‌, సాక్షి, బజ్‌రంగ్‌ పూనియా 2023లో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. రెజ్లర్ల ఉద్యమం తర్వాతే బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదుకాగా..దానిపై ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక ఆ ఆందోళనకు సంబంధించిన పలు విషయాలను తన పుస్తకంలో సాక్షి పంచుకుంది. ‘స్వార్థ పూరితంగా ఆలోచించే పాత విధానం ఉద్యమంలోకి ప్రవేశించింది. బజ్‌రంగ్‌, వినేశ్‌ మనసులలో వారి సన్నిహితులు దురాశను నూరి పోశారు. దాంతో 2023 ఆసియా క్రీడల ఎంపిక పోటీలనుంచి మినహాయింపు పొందే అంశాన్ని వారిద్దరూ లేవనెత్తారు’ అని సాక్షి విమర్శించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించాక..రెజ్లింగ్‌


సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన అడ్‌హాక్‌ కమిటీ సెలక్షన్‌ ట్రయల్స్‌ నుంచి బజ్‌రంగ్‌, వినేశ్‌లను మినహాయించింది. అయితే సాక్షి మాత్రం ఆ మినహాయింపు పొందేందుకు నిరాకరించింది. ఇక..ఆసియాడ్‌కు ముందు వినేశ్‌ గాయపడగా, ఆ క్రీడల్లో పతకం సాధించడంలో బజ్‌రంగ్‌ విఫలమయ్యాడు.

బబితది దురాలోచన..

ఉద్యమ సమయంలో.. బబితా ఫొగట్‌ స్వార్థపూరిత ఆలోచన చేసిందని వినేశ్‌ ఆరోపించింది. ఉద్యమానికి తాను మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించడం వెనుక బ్రిజ్‌భూషణ్‌ స్థానంలో ఆమె డబ్ల్యూఎ్‌ఫఐ చీఫ్‌ పదవి చేపట్టాలనే దురాలోచన ఉన్నదని తెలిపింది. కాగా తోటి రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియన్‌తో తన వివాహాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని సాక్షి వెల్లడించింది. కానీ అతణ్ణే పెళ్లిచేసుకోవాలని నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పింది. అలాగే తన అవార్డుల సొమ్ములో ఎక్కువ భాగాన్ని తల్లిదండ్రులు తీసుకున్నారని చెప్పింది.


వేధింపులకు గురయ్యా..

బాల్యంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని సాక్షి వెల్లడించింది. ట్యూషన్‌ టీచర్‌ వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. ‘నా ట్యూషన్‌ సార్‌ నన్ను లైంగికంగా వేధించాడు. సమయంకాని సమయంలో పాఠాలు చెప్పించుకొనేందుకు తన ఇంటికి రావాలని ఆదేశించేవాడు. దాంతో ట్యూషన్‌కు వెళ్లాలంటే ఎంతో భయపడేదానిని’ అని 32 ఏళ్ల సాక్షి వివరించింది.

Updated Date - Oct 22 , 2024 | 01:23 AM