9, 10 తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:35 AM
ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠ్లో ఈ నెల 9, 10తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సుశీందర్రావు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో ప్రదర్శన.. ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్బాబు
‘సమాజం కోసం విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత’ అనే ప్రధానాంశంతో విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించాలి : డీఈవో
రంగారెడ్డి అర్బన్, జనవరి 6 : ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠ్లో ఈ నెల 9, 10తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సుశీందర్రావు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, సమాచార సాంకేతిక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ప్రదర్శనకు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరు అవుతారని తెలిపారు. ఈ సంవత్సరం జాతీయ ఉపాధ్యాయ శిక్షణ, పరిశోధన సంస్థ ప్రకటించిన.. ‘సమాజం కోసం విజ్ఞానశాస్త్రం, సాంకేతికత’ అనే ప్రధానాంశంతో కూడిన ప్రాజెక్టులను విద్యార్థులు ఇందులో ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్లకు చెందిన మండల పరిషత్, జిల్లా పరిషత్, ప్రభుత్వ ట్రైబల్, మోడల్, కేజీబీవీ, సాంఘిక సంక్షేమం,ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయి విభాగాల్లో ఈ ప్రదర్శన నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతీ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ టీచర్లు ఈ ఫేర్ నిర్వహణలో చొరవ తీసుకొని నాణ్యమైన ప్రాజెక్టులను ప్రదర్శనకు తీసుకురావాలని కోరారు. వివరాల కోసం జిల్లా సైన్ అధికారి శ్రీనివాసరావును(ఫోన్ నంబర్) 9395390985లో సంప్రదించాలని తెలిపారు.