బీజేపీ, కాంగ్రెస్ల కుమ్మక్కుతోనే..
ABN , Publish Date - Mar 16 , 2024 | 04:16 AM
తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తి అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం..
కవిత నిర్దోషిగా తిరిగి వస్తారు: జగదీశ్
బీఆర్ఎ్సను దెబ్బ తీయాలనే కుట్ర
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు: మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తి అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బీజేపీ, కాంగ్రె్సలు కుమ్మక్కయ్యాయని, రాజకీయ దురుద్దేశంతోనే కవితను అరెస్టు చేయించారని ఆరోపించారు. కావాలనే శుక్రవారం సాయంత్రం అరెస్టు చూపించారని, శని, ఆదివారాలు కోర్టుకు సెలువులుంటాయని, బెయిల్ కూడా రాకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎ్సను రాజకీయంగా దెబ్బతియాలనే కుట్రతోనే బీజేపీ అక్రమాలకు తెరతీసిందన్నారు. శుక్రవారం కవిత అరెస్టు అనంతరం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కవితను అరెస్టు చేపిస్తామంటూ కొద్దిరోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఈడీ అధికారుల్లాగా పలుమార్లు ప్రకటనలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈడీ అధికారులు ముందే ప్లాన్ చేసుకొని వచ్చారని, ముందుగా సెర్చ్ మాత్రమే చేస్తామని చెప్పిన అధికారులు అనంతరం సాయంత్రం వేళ అరెస్టు చేశారని, అలాగే కవిత కోసం విమాన టికెట్లు బుక్ చేశారంంటే వారి ముందస్తు ప్లాన్ను అర్థం చేసుకోవచ్చన్నారు. శనివారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో శుక్రవారం కవితను అరెస్టు చేయడమనేది తమ అధినేత కేసీఆర్ను నైతికంగా ఇబ్బంది పెట్టడమేనని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతీసి.. లబ్ధి పొందేందుకే బీజేపీ, కాంగ్రె్సలు కలిసి కుట్రపన్నాయని ఆరోపించారు. ఇటువంటి కుట్రలు తమకు కొత్త కాదన్నారు. అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధాలు వంటివి ఎన్నో ఉద్యమ పార్టీగా చూశామని పేర్కొన్నారు.
వాటిని ఎదురించి, ఛేదించి, తెలంగాణను సాధించామని చెప్పారు. కవిత అరెస్టును ఖండిస్తూ శనివారం అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కవిత అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని, సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని హరీశ్రావు వెల్లడించారు. ఒకవైపు ఈడీ కేసుల్లో మహిళలను అరెస్టు చేయవచ్చా అన్న అంశంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోందని, దీనిపై ఈనెల 19న విచారణ జరగనున్న నేపథ్యంలోనే ఈ అరెస్టు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాటకు విలువ లేకుండా ఒక మహిళను అరెస్టు చేయడమనేది కుట్రలో భాగమేనన్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లను (ఆడబిడ్డలను) మోసం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. మహాలక్ష్మిపేరిట మహిళలకు రూ.2500 ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారని.. దీనిపై బాండ్ పేపర్ కూడా రాసిచ్చారని గుర్తు చేశారు. కవిత అరెస్టులో కుట్రకోణం ఉందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఆమె నిర్దోషిగా తిరిగి బయటకు వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు..
అంతా రాజకీయ కుట్ర: బీఆర్ఎస్ నేతలు
రాజకీయ కుట్రలో భాగంగానే ఈడీ ద్వారా కవితను అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్రెడ్డి, కడియం శ్రీహరి, నిరంజన్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఎన్నికల్లో తమ పార్టీ నేతలను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కూతురిని చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
మోదీవి బ్లాక్మెయిల్ రాజకీయాలు: బీఎస్పీ
ఈడీని అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కవితను అరెస్టు చేయించిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎ్స.ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తుకు చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే.. మోదీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ‘ఎక్స్’ వేదికగా ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగంగానే ఈ అరెస్టు జరిగిందన్నారు.