తెలంగాణకు రూ.5,071 కోట్లు
ABN , Publish Date - Feb 02 , 2024 | 03:29 AM
తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో రూ.5,071 కోట్ల నిధులను కేటాయించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో రూ.5,071 కోట్ల నిధులను కేటాయించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. గురువారం ఆయన వర్చువల్గా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రానున్న 6-8 ఏళ్లలో జాతీయ స్థాయిలో 40 వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లను నిర్మిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.31,221 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. 2009-14 మధ్యకాలంలో రాష్ట్రంలో ఏటా సగటున 70 కిలోమీటర్ల ట్రాక్లను నిర్మించగా.. గడిచిన పదేళ్లలో ఆ సగటు 142 కిలోమీటర్లకు పెరిగిందని వివరించారు. ‘‘గత పదేళ్లలో 414 ఆర్యూబీలు, ఆర్వోబీలను నిర్మించాం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేశాం. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేలా.. రాష్ట్రవ్యాప్తంగా 45 రైల్వే స్టేషన్లలో వన్స్టేషన్-వన్ ప్రోడక్ట్ స్టాల్స్ను ఏర్పాటు చేశాం’’ అని ఆయన పేర్కొన్నారు.