Kumaram Bheem Asifabad- మేడారంకు 80 ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Feb 20 , 2024 | 09:23 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు 80 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు అధికంగా తరలి వెళ్లనున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆర్టీసీ అధికారులు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 20: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు 80 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు అధికంగా తరలి వెళ్లనున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రత్యేక బస్సులను ఆసిఫాబాద్, బెల్లంపల్లి రెండు పాయింట్ల ద్వారా నడుపుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. గతంలో జాతర సమయంలో 65 బస్సులు మాత్రమే రాకపోకలు సాగించాయి. కాగా ఈ సారి ప్రయాణికుల రద్దీ మేరకు అదనంగా మరో 15 బస్సులను నడిపిస్తున్నారు. ఇందు కోసం ఆసిఫాబాద్ డిపోలోని 35 బస్సులు, ఉట్నూరు డిపోకు చెందిన 10, బోధన్ డిపోకు చెందిన 35 బస్సులతో పాటు డ్రైవర్, కండక్టర్లను ఆసిఫాబాద్ డిపోకు తెప్పించి వారికే విధులను కేటాయించారు. మొత్తం 80 బస్సులను జాతరకు ఏర్పాటు చేశారు.
మహాలక్ష్మి పథకంలో..
మహాలక్ష్మి పథకంలో భాగంగా మేడారం జాతరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నారు. మహిళలు ఒర్జినల్ ఆధార్ కా ర్డు తప్పని సరిగా వెంట తీసుకుని రావాలని ఆర్టీసీ అధికారులు సూచి స్తున్నారు. ఆధార్ కార్డులలో పాత ఫొటోలు, చిన్న నాటి ఫొటోలు ఉన్న మహిళలు తప్పని సరిగా అప్డేట్ చేసుకోవాలని బస్సు తనిఖీ సమయంలో తనిఖీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆధార్ కార్డు తమ వెంట తీసుకు రావాలని పేర్కొంటున్నారు. మహిళలకు జాతరకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఈ సారి బస్సులనీ రద్దీతో కిటకిట లాడుతున్నాయి.
ఆసిఫాబాద్ డిపో పరిధిలో..
మేడారం జాతరకు ఆసిఫాబాద్ డిపో పరిధిలో ఆర్టీసీ అధికారులు ఆసిఫాబాద్, బెల్లంపల్లి పాయింట్లను ఏర్పాటు చేసి 80 బస్సులను సో మవారం నుంచి నడుపుతుంది. జాతరకు బస్సులు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, గోదావరిఖని, మంథని, కాటారం, భూపాలపల్లి, గోవింద్రావు పేట, పత్రల మీదుగా మేడారం జాతరకు చేరుకుంటాయి. మేడారం జాతర ముగించుకుని బస్సులు తిరుగుతు ప్రయాణంలో ఆసిఫాబాద్ వైపు రావాలంటే మేడారం బస్ స్టేషన్లో 15 నెంబర్ క్యూలైన్ వద్ద ఉండాలని ఆర్టీసీ అదికారులు సూచిస్తున్నారు. ఆసిఫాబాద్ నుంచి మేడారంకు టికెట్ ధర పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.300, బెల్లంపల్లి నుంచి పెద్దలకు రూ.470, పిల్లలకు రూ.260 గా ధర నిర్ణయించారు. బస్సులలో భక్తులు కోళ్లు, మేకలు తీసుకు పోవడానికి అనుమతి లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు.
జాతరకు ప్రత్యేక బస్సులు..
- శ్రీధర్, ఆసిఫాబాద్ డిపో మేనేజర్
మేడారం జాతరకు ఆసిఫాబాద్ డిపో నుంచి 80 ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. ఇందు కోసం ఆసిఫాబాద్, బెల్లంపల్లి పాయింట్లను ఏ ర్పాటు చేశాం. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఒరిజినల్ ఆధార్కార్డు తప్పని సరిగా వెంట తీసుకుని వెళ్లాలి. జాతరకు ఈ సారి రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో కంటే అదనంగా 15 బస్సులను నడుపుతున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకుంటూ సిబ్బందికి సహకరించాలి.