Manchiryāla- కాంగ్రెస్లో పెరుగుతున్న ఆశావహులు
ABN , Publish Date - Mar 18 , 2024 | 10:20 PM
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎ స్లు పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.
- ప్రశ్నార్థకంగా సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్నేత భవితవ్యం
మంచిర్యాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎ స్లు పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాగా కాంగ్రెస్ ఇంకా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండ డంతో ఆశావహుల్లో కొత్తవారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. పెద్దపల్లి పార్లమెంటు స్థానం కింద ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, అన్ని స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. గెలుపు ఊపుమీద ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం పార్లమెంటు స్థానాన్ని సైతం కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో పెద్దపల్లి స్థానానికి సరియైన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో అచితూచి అడుగులు వేస్తోంది.
- బీజేపీ, బీఆర్ఎస్ ప్రకటనతో..
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థులను ప్రకటించినందున కాంగ్రెస్ కూడా ఖరారు చేసే పనిలో నిమగ్న మైంది. ఈ విషయమైన ఢిల్లీలో సోమవారం నిర్వహించిన స్ర్కీనింగ్ కమిటి సవవేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 19న కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో స్ర్కీనింగ్ కమిటీ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశం పూర్తికాగానే పెద్దపల్లి స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఏఐసీసీ పెద్దలు ఇప్పటికే అభ్యర్థి పేరును ఖరారు చేయగా, సీల్డు కవర్లో ఆశావహుల భవితవ్యం దాగి ఉంది. కాగా ఏఐసీసీ పెద్దలు మంగళవారం తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
- పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ..
పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ పడే పలువురు ఆశావహుల పే ర్లు ఇప్పటికే తెరపైకి రాగా, టికెట్ ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో ఉంది. పెద్దపల్లి స్థానం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు కావడంతో పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న వారి లో ప్రధానంగా మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ కాకా వెంకటస్వామి మనవడు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద తనయు డు గడ్డం వంశీకృష్ణ, నేతకాని సామాజిక వర్గానికి చెందిన సిటిం గ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ సుగుణకుమారి, ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి రిసార్ట్స్ అధినేత ఆసంపల్లి శ్రీనివాస్, టీపీసీసీ కార్యదర్శి పెర్క శ్యామ్, టీపీసీసీ సభ్యుడు ఊట్ల వరప్రసాద్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీకి దక్కేనా?
పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి విపరీతమైన పోటీ నెలకొనడం, సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత భవితవ్యం ఏంటనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను వీడిన ఆయన బీఆర్ఎస్లో చేరి ఎంపీగా గెలు పొందారు. ప్రస్తుత ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ను వీడి ఫిబ్రవరి 6న తిరిగి కాంగ్రెస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ టికెట్ ఆయన్నే వరిస్తుందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే కాల క్రమంలో పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య పెరగడంతో టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపల్లి టికెట్ కోసం విపరీతమైన పైవరీలు జరుగుతుండడం, రాష్ట్ర నాయకత్వంపై తీవ్రమైన ఒత్తిడి కూడా ఉండడంతో వెంకటేశ్నేతకు టికెట్ అందని ద్రాక్ష అవుతుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కేవలం టికెట్ కోసం ఆయన బీఆర్ఎస్ను వీడగా, కాంగ్రెస్లోనూ టికెట్ అవకాశాలు చేజారి పోతుండడంతో ఆయ న రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.