దాడి చేయడం సరైనది కాదు
ABN , Publish Date - Feb 28 , 2024 | 11:13 PM
పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడడం దారుణమని సీనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణా నాయక్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ అన్నారు.
- పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణా నాయక్
- మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన
ఆత్మకూరు, ఫిబ్రవరి 28: పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడడం దారుణమని సీనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణా నాయక్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ అన్నారు. మండల పరిధిలోని రేచింతల గ్రామ పంచాయతీ కార్యదర్శి మన్యంపై అదే గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు రాములు దాడికి పాల్పడ్డాడు. బుధవారం పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే కాకుండా గ్రామానికి సంబంధించిన అన్ని పనుల్లో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో పంచాయతీ కార్యదర్శులపై దాడులకు పాల్పడకూడదని ఆత్మకూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదును అందజేశామని వారు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ పంచాయతీ కార్యద ర్శుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లన్న, హరీష్, కార్యదర్శులు వెం కటేష్, నూతన్, మనోహర్ గౌడ్, మురళి, వెంకటపతి, రాజు, వెంకటస్వామి , యశోద, మానస, మహబూబ్ పాషా, పలువురు పాల్గొన్నారు.
పెద్దలు నాయకుల సమక్షంలో క్షమాపణ
పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడిన రేచింతల గ్రామానికి చెందిన రాములు గ్రామ పెద్దలు సమక్షంలో పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరసన కార్యక్రమం వద్దకు వెళ్లి క్షమాపణ కోరారు. దాంతో కార్యదర్శులు పోలీస్ స్టేషన్లో కేసును వాపస్ తీసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రహమతుల్లా మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం పూర్తికావడంతో పంచాయతీ కార్యదర్శులు పాలన సాగుతోందని, వారికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు బాలకిష్టన్న, విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు పరమేష్, శ్రీనివాసులు, తులసిరాజ్ పాల్గొన్నారు.