ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎండిన పంటలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:49 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే పంటలు ఎండిపోయాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ ఆరోపించారు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణం ప్రకటించిన పది వేలు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు.
రైతు దీక్షలో ఎంపీ బండి సంజయ్ కుమార్
కరీంనగర్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే పంటలు ఎండిపోయాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ ఆరోపించారు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణం ప్రకటించిన పది వేలు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు. ఎకరానికి వెంటనే 25 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి కౌలు రైతులకు 15 వేలు, కూలీలకు 12 వేలు చెల్లించాలన్నారు. మంగళవారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రె్సను నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతారా అని ప్రశ్నించారు. రైతు భరోసా కోసం ఎకరానికి ఏడాదికి 15 వేలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేసీఆర్ గడీల పాలనకు అంతం పలికిన ఘనత బీజేపీదేనన్నారు. ఇతర పార్టీల నేతల కోసం గేట్లు తెరవడం కాకుండా సాగునీటి విడుదలకు గేట్లు తెరవాలన్నారు. కేసీఆర్ ఫాం హౌస్ నుంచి రాజకీయాలు చేస్తే, కాంగ్రెస్ నేతలు హామీల పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.తాము శ్రీరాముడి ఫొటోతో ఓట్లడుగుతున్నామని, వాళ్లకు దమ్ముంటే బాబర్ ఫొటోతో ప్రచారం చేసుకోవాలని సవాల్ విసిరారు.