తప్పుడు నివేదికలిచ్చిన ఇంజనీర్లను ఉరి తీయాలి
ABN , Publish Date - Feb 15 , 2024 | 04:02 AM
మిషన్ భగీరథ పనుల్లో పాలకుల మెప్పు కోసం తప్పుడు నివేదికలిచ్చిన ఇంజనీరింగ్ నిపుణులను ఉరి తీయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. సాంకేతిక అంశాలను పరిశీలించకుండా వారిచ్చిన నివేదికల వల్లే మిషన్ భగీరథ కేంద్రీకృత ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని
మండలిలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్రెడ్డి
ఢిల్లీ వాణి తప్ప ప్రజావాణి లేదు: కవిత
శాసన మండలిలో బడ్జెట్పై చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మిషన్ భగీరథ పనుల్లో పాలకుల మెప్పు కోసం తప్పుడు నివేదికలిచ్చిన ఇంజనీరింగ్ నిపుణులను ఉరి తీయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. సాంకేతిక అంశాలను పరిశీలించకుండా వారిచ్చిన నివేదికల వల్లే మిషన్ భగీరథ కేంద్రీకృత ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని ఆయన విమర్శించారు. బుధవారం శాసనమండలిలో 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ, తాగునీటి ఫ్లోరినేషన్ ప్రభావం కేవలం 20 కిమీ ప్రవాహం వరకే పరిమితమైందని, కాని మిషన్ భగీరథలో 100 నుంచి 200 కిమీ వరకు తాగునీటి పైప్లైన్లలో ఫ్లోరినేషన్ చేశారని చెప్పారు. అవగాహన లేకుండా కేవలం రాజకీయ అవసరాల కోసమే మిషన్ భగీరథ పనులకు అనుమతులిచ్చారని ఆరోపించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను జీవన్రెడ్డి ఎండగట్టారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ వాణి తప్ప ప్రజావాణి లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రతిపైసా పేదవర్గాల సంక్షేమం కోసమే ఖర్చు చేసిందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, కేసీఆర్ అధికారం చేపట్టిన మొదటి దఫాలో మహిళా మంత్రులే లేరని విమర్శించారు. కాని కాంగ్రెస్ మహిళలకు పెద్ద పీట వేసిందని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు జీ.మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ, ప్రగతిభవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించామని చెప్పారు. రాష్ట్రంలో ఢిల్లీ తరహాలో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, సాంకేతిక శిక్షణ సంస్థలను ఆధునీకరిస్తామని పేర్కొన్నారు.