డాక్యుమెంట్లు తగ్గినా పెరిగిన రాబడి
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:26 AM
ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ల ద్వారా ఈ ఏడాది (2023-24) ప్రభుత్వానికి దాదాపు రూ14,500 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. గత ఏడాదిలో (2022-23)లో రూ.14,291.04 కోట్ల ఆదాయం నమోదైంది.
ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ద్వారా రూ.14,500 కోట్లు
209 కోట్లకుపైగా పెరిగిన ఆదాయం
హైదరాబాద్, ఏఫ్రిల్ 1 (ఆంధ్రజ్యోతి):ధరణి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ల ద్వారా ఈ ఏడాది (2023-24) ప్రభుత్వానికి దాదాపు రూ14,500 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. గత ఏడాదిలో (2022-23)లో రూ.14,291.04 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ మేరకు ఈ ఏడాది సుమారు రూ.209 కోట్లకుపైగా అధిక ఆదాయం వచ్చింది. డాక్యుమెంట్ల నమోదు మాత్రం నిరుటితో పోల్చితే తగ్గింది. సుమారు 1.30 లక్షల వరకు డాక్యుమెంట్లు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కోడ్ నేపథ్యంలో నగదు చలామణిపై ఈసీ ఆంక్షలు విధించింది. కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్లు, ఇతర స్థిరాస్తుల లావాదేవీలు రెండు నెలల పాటు మందగించాయి. ధరణి ద్వారా వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, పెండింగ్ మ్యూటేషన్లు, సక్సెషన్లు, జీపీఏ, నాలా, లీజ్ తదితర ఫీజుల ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరినట్లు అదికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ద్వారా వ్యవసాయేతర భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు, వ్యాపార సముదాయాలు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ప్రక్రియ, స్టాంప్స్లు, ఈ స్టాంప్స్ల విక్రయాలు, వివాహాల నమోదు, ఈసీలు, మార్టిగేజ్, లీజ్ ఫీజులు, గిఫ్ట్లు, పార్టీషన్ తదితర లావాదేవీలతో 12,500 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.