బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత ఇందిరమ్మదే!
ABN , Publish Date - Feb 20 , 2024 | 05:07 AM
బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
సేవాలాల్ జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి
కూసుమంచి, ఫిబ్రవరి 19: బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో సోమవారం నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామాన్యుడిగా పుట్టి అసమాన్యుడిగా ఎలా ఎదగాలో ఆచరించి చూపిన మహానుభావుడు సేవాలాల్ అని కొనియాడారు. అందుకే సేవాలాల్ జయంతిని ప్రభుత్వం ఫిబ్రవరి 15 సెలవుదినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వాల హాయాంలోనే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని ఆయన పేర్కొన్నారు.