Share News

ఎలా కట్టారు? డిజైన్లు ఎవరివి?

ABN , Publish Date - May 12 , 2024 | 05:47 AM

కాళేశ్వరం బ్యారేజీలతో పాటు కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం (అన్నారం), సుందిళ్ల పంప్‌హౌ్‌సల నిర్మాణానికి సంబంధించి రామగుండం పూర్వ ఈఎన్‌సీ నల్లా వెంక టేశ్వర్లుపై జస్టిస్‌ పినాకి

ఎలా కట్టారు? డిజైన్లు ఎవరివి?

కాళేశ్వరం బ్యారేజీలపై లిఖితపూర్వకంగా నివేదిక ఇవ్వండి

మాజీ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లును కోరిన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌

దాదాపు గంటపాటు ప్రశ్నల వర్షం

విచారణలో కమిషన్‌కు సహాయం అందించేందుకు నిపుణుల కమిటీ

హైదరాబాద్‌, మే 11(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీలతో పాటు కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం (అన్నారం), సుందిళ్ల పంప్‌హౌ్‌సల నిర్మాణానికి సంబంధించి రామగుండం పూర్వ ఈఎన్‌సీ నల్లా వెంక టేశ్వర్లుపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం వెంకటేశ్వర్లును కమిషన్‌ పిలిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఏ విధంగా కట్టారు? ప్లానింగ్‌ ఏమిటి? డిజైన్లు ఎవరు తయారుచేశారు? నమూనా అధ్యయనాలు చేశారా డిజైన్లకు తగ్గట్లుగానే నిర్మాణం జరిగిందా? బ్యారేజీలు ఈ ప్రాంతంలోనే కట్టాలని చెప్పిందెవరు? నిపుణుల నివేదిక ఉందా? అంటూ దాదాపు గంటపాటు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో వెంకటేశ్వర్లుపై ప్రశ్నలు సంధించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టాలనుకుంటే రీడిజైన్‌ పేరుతో మేడిగడ్డలో బ్యారేజీ కట్టడానికి కారణం ఏమిటి? మేడిగడ్డ వద్ద అదనంగా నీటి లభ్యత ఉందా? అని ప్రశ్నించారు. హైడ్రాలజీ నివేదికలు అందించాలని కోరారు. నీటి లభ్యతపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చెప్పిందేంటి? మీరు చేసిందేంటి? బ్యారేజీలు పూర్తయిన సంవత్సరమే తొలి వరదలకే నష్టం గుర్తించినా బ్యారేజీలకు మరమ్మతులు ఎందుకు చేయలేదని అడిగారు. బ్యారేజీల నిర్మాణ పనులు పూర్తికాకముందే పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారు? డిఫెక్ట్‌ లయబిలిటీ కాలం పూర్తికాకుండానే బ్యాంకు సెక్యూరిటీ గ్యారంటీలను ఎలా రిలీజ్‌ చేశారు? డిఫెక్ట్‌ లయబిలిటీ కాలంలోనే నష్టాలు జరిగినా నిర్మాణ సంస్థలతో మరమ్మతులు ఎందుకు చేయించలేరు? బ్యారేజీల వైఫల్యానికి కారణం ఏంటి? నిర్మాణపరమైన లోపాలా? డిజైన్‌లో లోపాలా? ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం) లోపాలా? అని ప్రశ్నించింది. ఐఎస్‌ కోడ్‌ ప్రకారం వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల స్థితిగతులను పరిశీలించారా? అని ఆరా తీసింది. ప్రతి కాంపోనెంట్‌కు అంశాలవారీగా వెంకటేశ్వర్లు జవాబు ఇవ్వగా లిఖితపూర్వకంగా సమర్పించాలని ఘోష్‌ నిర్దేశించారు. విచారణలో భాగంగా ఈ నెల 6న రాష్ట్రానికి వచ్చిన ఘోష్‌ ఆదివారం కోల్‌కతాకు తిరిగి వెళ్లనున్నారు. నెలాఖరున లేదా జూన్‌ తొలి వారంలో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీలపై ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 31 దాకా జరుగనుంది.


స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు విజ్ఞప్తి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించే ప్రక్రియలో స్వతంత్రంగా కమిషన్‌కు సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా స్వతంత్ర కమిటీని వేయాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నీటిపారుదల శాఖతో, ఏ రాజకీయ పార్టీ లేదా ఏ సంఘంతో సంబంధం లేని నిపుణులను కమిటీలో నియమించాలని సూచించారు. సివిల్‌, మెకానికల్‌, హైడ్రాలజీ, ప్లానింగ్‌, డిజైన్‌ వంటి విభాగాలకు చెందిన వారిని కమిటీలో నియమించాలని కోరారు. దాంతో నిపుణులను గుర్తించే పనిలో ప్రభుత్వం పడింది.

Updated Date - May 12 , 2024 | 05:48 AM