చేవెళ్ల నుంచి కాసాని..!
ABN , Publish Date - Mar 12 , 2024 | 04:32 AM
గతనెలలో లోక్సభ నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్ అధినాయకత్వం పార్టీ నేతలతో సమావేశాలు జరిపి.. పార్టీ తరఫున కొందరు అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. అందులో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి తొలుత సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డి పేరును ప్రకటించింది.
తొలుత సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డి పేరు.. ఆయన విముఖతతో జ్ఞానేశ్వర్కు చాన్స్
నల్లగొండకు కంచర్ల కృష్ణారెడ్డి!
మెదక్ అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి
చేవెళ్ల, నల్లగొండ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గతనెలలో లోక్సభ నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్ అధినాయకత్వం పార్టీ నేతలతో సమావేశాలు జరిపి.. పార్టీ తరఫున కొందరు అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. అందులో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి తొలుత సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డి పేరును ప్రకటించింది. అయినప్పటికీ.. ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీకి విముఖత చూపిన నేపథ్యంలో.. ఆయనతో సంప్రదింపులు, బుజ్జగింపులు చేసి నా ఫలితం లేకుండాపోయింది. దీంతో చేవెళ్ల అభ్యర్థిపై పార్టీ అధిష్ఠానం తీవ్రస్థాయిలో కసరత్తు చేసింది. ఆ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ను పోటీలో దించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం నందినగర్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. దీనికి ఎంపీ రంజిత్రెడ్డి గైర్హాజరయ్యారు. కాగా రంజిత్రెడ్డితో మరో ప్రధాన పార్టీకి చెందిన నేతలు టచ్లో ఉన్నారని, లోక్సభ ఎ న్నికల నేపథ్యంలో పలువురు ఆయనతో సం ప్రదింపులు జరుపుతున్న కారణంగానే.. సమా వేశానికి ఆయన రాలేదని తెలుస్తోంది. మరోవైపు.. మెదక్ నుంచి గజ్వేల్కు చెందిన బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పోటీకి అమిత్ రెడ్డి దూరం!
మొన్నటి వరకు నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు అమిత్రెడ్డి పోటీ చేస్తారని భావించినప్పటికీ.. స్థానిక రాజకీయ పరిణామాల దృష్యా.. ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన కేసీఆర్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ముఖ్యనేతలతో చర్చలు జరిపారు. నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు ప్ర స్తావనకు రాగా.. కృష్ణారెడ్డికే అవకాశం దక్కనున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
కరీంనగర్లో నేడు బీఆర్ఎస్ కదనభేరి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అందు లో భాగంగానే మంగళవారం కరీంనగర్లో కదనభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందులో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఉద్యమ సమయం నుంచి పార్టీ కార్యక్రమాలను కరీంనగర్లోని ఎస్.ఆర్.ఆర్ కాలేజీ మైదానం నుంచే ప్రారంభించాలన్న గులాబీ బాస్ సెంటిమెంట్కు అనుగుణంగా ఇక్కడ సభకు ఏర్పాట్లు చేసినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున జనసమీకరణపై దృష్టి పెట్టాయి. ఏడు నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మందిని తరలించేందుకు చూస్తున్నాయి.