CM Revanth Reddy : కేసీఆర్.. ఎక్స్పైర్డ్ మెడిసిన్
ABN , Publish Date - Feb 09 , 2024 | 04:16 AM
కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ లాంటి వారని, అధికారం పోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదని విమర్శించారు. ఉంటే.. ఉభయసభలను ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగానికి,
తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు.. మొహం చెల్లకనే అసెంబ్లీకి దూరం
పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. ప్రజలు బీఆర్ఎ్సను పట్టించుకోవట్లేదు
కాళేశ్వరంలో అవినీతి తేలడంతో తెరపైకి కేఆర్ఎంబీ.. ప్రాజెక్టులు అప్పగించిందే కేసీఆర్
సాగర్పైకి జగన్ పోలీసులను పంపితే ఏం చేశారు?.. ఇది తెలిసే ప్రజలు తిరస్కరించారు
మరింత పకడ్బందీగా టీఎ్సపీఎస్సీ నోటిఫికేషన్లు.. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
పాత గ్రూప్-1 రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్.. ప్రస్తుత అసెంబ్లీలోనే కులగణనపై తీర్మానం
అసెంబ్లీలోని చాంబర్లో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ లాంటి వారని, అధికారం పోవడాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదని విమర్శించారు. ఉంటే.. ఉభయసభలను ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగానికి, శాసనసభ బీఏసీ సమావేశానికి కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. శాసనసభకు కేసీఆర్ బరాబర్ రావాలని, ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత నిర్వర్తించాలనే తాను కోరుకుంటానన్నారు. కానీ ఆయనకే మొహం లేక రావట్లేదన్నారు. ప్రజలు కూడా కేసీఆర్, బీఆర్ఎస్ గురించి పట్టించుకోవడం, ఆలోచించడం మానేశారన్నారు. అసెంబ్లీలోని తన చాంబర్లో గురువారం మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్చాట్గా మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై నిబంధనల ప్రకారమే ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని హైకోర్టు సూచించినట్లు వెల్లడించారు. దీనిపై మంత్రివర్గంలో గానీ, అసెంబ్లీలో గానీ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మిషన్ భగీరథపైనా విచారణకు ఆదేశించామన్నారు. కాళేశ్వరం అవినీతిని పక్కదారి పట్టించేందుకు కేఆర్ఎంబీ అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. ఏపీ మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. బేసిన్లు లేవు.. బేషజాలూ లేవు.. అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే తెలంగాణ పట్ల ఆయనకున్న కమింట్మెంట్ను తెలియజేస్తోందన్నారు. కేసీఆర్ కమిట్మెంట్పై ఆయన మేనల్లుడు హరీశ్కూ అనుమానం ఉందన్నారు. కృష్ణా జలాల విషయంలో ఆయన చిత్తుశుద్ధిని చూసే.. ఆయకట్టు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎ్సను తిరస్కరించారని, ఆయా జిల్లాల్లో ఆ పార్టీకి ఆ పార్టీకి కేవలం నాలుగు సీట్లే వచ్చాయని గుర్తు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. నాగార్జున సాగర్కు పోలీసులను పంపి ఆక్రమించినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు? ప్రశ్నించారు.
పకడ్బందీగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు
టీఎ్సపీఎస్సీ నోటిఫికేషన్ల అంశంలోనూ ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. నిరుద్యోగులు ఇబ్బందులుపడకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎ్సఎల్పీ కార్యాలయం మార్పు అన్నది స్పీకర్ నిర్ణయమని చెప్పారు. బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ తరపున కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్లు మాత్రమే ఇచ్చారని, ఇచ్చిన పేర్లలో హరీశ్రావు పేరు ఉంటే ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు. అనుమతించాలా.. లేదా అన్నది స్పీకర్ నిర్ణయమని స్పష్టం చేశారు. రేపు కేటీఆర్కు బదులుగా హిమాన్షు వస్తానంటే.. అనుమతించేస్తామా? అని నిలదీశారు. కులగణనపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలవడంపై స్పందిస్తూ.. సీఎం తాను ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే కేసీఆర్నూ కలుస్తానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందిస్తూ.. ఆయన ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్, అలాంటి వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాగాంధీని కలిసి కోరామని తెలిపారు.
ఇసుక అంతా.. అవినీతి దందా
‘‘ఇసుక అక్రమ రవాణాపై ఈనెల 3 నుంచి రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించాను. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. 22 లారీలకు అసలు అనుమతే లేదు. ఒకే పర్మిట్, ఒకటే నెంబర్తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు తేలింది. ఈ లెక్కన మొత్తం ఇసుకలో 25 శాతానికిపైగా అక్రమంగా తరలిపోతోంది.. అక్రమాలను గుర్తించాల్సిన టీఎ్సఎండీసీ అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా?’’ అని సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎ్సఎడీసీ అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్షించారు. ప్రస్తుత ఇసుక విధానం అవినీతి దందాగా మారిందన్నారు. అక్రమాలకు ఆస్కారం లేని విధంగా కొత్త పాలసీని తీసుకురావాలని సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని, 48 గంటల్లోగా అధికారులు పద్ధతి మార్చుకోవాలని గడువు విధించారు. రెండురోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీలతో తనిఖీలు చేయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. టోల్గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసు క లారీల తతంగాన్ని బయటకు తీయాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. టీఎ్సఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి, గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని సీఎ్సను ఆదేశించారు. కాగా, హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా నిర్వహించే స్టోన్ క్రషర్స్ను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. అనుమతులు ఇచ్చేటప్పుడే ఆ భవనాల వివరాలు సదరు విభాగానికి చేరేలా ఇంటిగ్రేటేడ్ ఆన్లైన్ విధానం అమలు చేయాలని సూచించారు. గ్రానైట్, ఖనిజాల అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్ఎ్సను వినియోగించాలని పేర్కొన్నారు. గ్రానైట్తోపాటు ఇతర క్వారీలకు సంబంధించిన పెండింగు కేసుల వివరాలు, పురోగతిపై నివేదిక అందించాలని ఆదేశించారు.
నాయకుల జోక్యం ఉండదు
భూగర్భ, గనుల శాఖలో అవినీతిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు తమ సమస్యలనూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీనిపై సీఎం స్పందిస్తూ.. ’’ఇప్పుడు మీపై ఎవరి ఒత్తిడి ఉండదు. అవినీతి, అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి.. అక్రమాలను అడ్డుకోకుండా మీ విధుల్లో ఎవరూ జోక్యం చేసుకోరు’’ అని చెప్పినట్లు తెలిసింది.