మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.1.73లక్షలు డ్రా చేసిన యువకుడు
ABN , Publish Date - Apr 08 , 2024 | 11:56 PM
ఏటీఎం నుంచి డబ్బులు తీయడం తెలియక ఓవ్యక్తి సాయం కోరిగా సదరు వ్యక్తి ఆ మహిళకు కుచ్చుటోపీ పెట్టాడు. ఏ
మేడ్చల్ టౌన్, ఏప్రిల్ 8: ఏటీఎం నుంచి డబ్బులు తీయడం తెలియక ఓవ్యక్తి సాయం కోరిగా సదరు వ్యక్తి ఆ మహిళకు కుచ్చుటోపీ పెట్టాడు. ఏటీఎం కార్డు నుంచి దర్జాగా రూ.173లక్షలు కాజేశాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూడూరు గ్రామానికి చెందిన ఫుణ్యవతి(40) గత జనవరి 27న డబ్బులు విత్డ్రా చేయడానికి తన బ్యాంకు ఏటీఎం కార్డుతో మేడ్చల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్దకు వచ్చింది. డబ్బులు విత్డ్రా చేసే విధానం తెలియక పుణ్యవతి అక్కడే ఉన్న ఓగుర్తుతెలియని యువకుడికి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నెంబరు తెలిపింది. దీంతో ఆ యువకుడు పుణ్యవతి చెప్పినట్లు రూ.4వేలు విత్డ్రా చేసి ఇచ్చాడు. అనంతరం ఫుణ్యవతికి ఆమె ఏటీఎం కార్డుకు బదులుగా అతడి వద్ద ఉన్న మరో ఎస్బీఐ కార్డును ఇచ్చాడు. దీంతో కార్డు మార్చి ఇచ్చిన విషయం గమనించని ఫుణ్యవతి యువకుడు ఇచ్చిన కార్డును తనవద్ద భద్రపరుచుకుంది. కాగా నాలుగు రోజుల కిందట డబ్బులు డ్రాచేయడానికి ఏటీఎం వద్దకు వెళ్లగా బ్యాంకు కార్డు పని చేయలేదు. దీంతో కార్డును పరిశీలించగా ఆకార్డు తనది కాదని గుర్తించి వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి ఖాతాలోని వివరాలు తెలుసుకుంది. ఖాతా నుంచి రూ.1.73లక్షలు విత్ డ్రా చేసినట్లు రికార్డులో ఉంది. దీంతో బాధితురాలు సోమవారం మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.