అక్రమంగా తరలిస్తున్న 3 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:05 AM
అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఘట్కేసర్ పోలీసులు పట్టుకున్నారు.
ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 16: అక్రమంగా తరలిస్తున్న మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఘట్కేసర్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా, తుర్కపల్లికి చెందిన గూగులోతు బద్య ఘట్కేసర్ మున్సిపల్, బొక్కొని గూడలో మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని ఇటుకబట్టిల్లో పనిచేసే కార్మికులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో మంగళవారం ఉదయం రేషన్ బియ్యాన్ని ట్రాలీ వాహనంలో తరలిస్తుండగా బద్యను అదుపులోకి తీసుకొని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ధారూరులో ఇసుక ట్రాక్టర్..
ధారూరు: అడవిలో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం రాత్రి అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీసెక్షన్ అధికారి మోయినోద్దిన్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ధారూరు అటవీ రేంజ్ పరిధిలోని రాస్నం సెక్షన్లోని సంగయపల్లితండా అటవీప్రాంతం నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని పోలీ్సస్టేషన్కు తరలించామని చెప్పారు. సంగాయపల్లి తండాకు చెందిన మిట్టునాయక్ అడవిలో నుంచి రాత్రి సమయంలో ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మిట్టునాయక్పై గత ఫిబ్రవరి 20న అడవిలో అక్రమంగా చెట్ల నరికివేతకు సంబంధించి కేసు నమోదైందని వెల్లడించారు. అదేవిధంగా 2019లో అతడి వద్ద నుంచి జంతువుల వేటకు ఉపయోగించే తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటి చలాన్లఉ కూడా ఇప్పటి వరకు చెల్లించలేదని తెలిపారు.