చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:13 AM
ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూరులోని కనకదుర్గ దేవాలయంలో గత నెల 26న జరిగిన చోరీ కేసును ఆదిభట్ల పోలీసులు చేదించారు. ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
3 తులాల బంగారం రికవరీ
ఆదిభట్ల, మార్చి 3 : ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూరులోని కనకదుర్గ దేవాలయంలో గత నెల 26న జరిగిన చోరీ కేసును ఆదిభట్ల పోలీసులు చేదించారు. ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ రాఘవేందర్రెడ్డి మాట్లాడుతూ కనకదుర్గ దేవాలయంలో చోరీ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో సీసీ టీవీ పుటేజ్ను పరిశీలించి గుర్తు తెలియని వ్యక్తి దేవాలయం గ్రిల్స్లో నుంచి కర్రతో అమ్మవారి మెడలోని మంగళసూత్రాన్ని దొంగిలించినట్లు గుర్తించామని తెలిపారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు పర్యవేక్షణలో ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, గిరి, కానిస్టేబుళ్లు కృష్ణ, ఉపేందర్రెడ్డి, రవిందర్తో టీంను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తును ప్రారంభించి వివిధ కోణాల్లో జరిపి నిందితుడు సంగారెడ్డి జిల్లా మునుపల్లి మండలం, బుద్దెర గ్రామానికి చెందిన వడ్డె పోసయ్య(35)గా గుర్తించి అరెస్టు చేసి అతని నుంచి చోరీకి గురైన మూడు తులాల మంగళసూత్రం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అతనిపై వివిధ పోలీ్సస్టేషన్లలో 30 కేసులు ఉన్నాయని, తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పారు. ఆరు రోజుల్లో కేసును చేదించిన ఎస్సై బాలరాజు, హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, గిరి, కానిస్టేబుళ్లు కృష్ణ ఉపేందర్రెడ్డిని ఆయన అభినందించారు.
పక్కా ప్రణాళికతో చోరీ..
నిందితుడు పోసయ్య ఇప్పటి వరకు 30 దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు. ముందుగా ఎంచుకున్న దేవాలయంలో వారం రోజుల పాటు గుడికి వెళ్లి భక్తునిలా పూజలు చేస్తూ, స్థానికుడిలా కనిపించడానికి పరిసర ప్రాంతాలల్లోనే తిరుగుతుంటాడని చెప్పారు. పరిసర ప్రాంతాలను పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత చోరీకి పాల్పడుతాడని అన్నారు. నిందితుడు వడ్డె పోసయ్య, కొమెర పోచయ్య, రాజు, రాజేశ్వర్ పేర్లతో వివిధ ప్రాంతాల్లో తిరుగుతాడని చెప్పారు.