రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ABN , Publish Date - May 21 , 2024 | 11:48 PM
వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు కోరారు.
ఆమనగల్లు, మే 21 : వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు కోరారు. విధుల నిర్వహణలో ఎక్కడా అలసత్వానికి తావివ్వకూడదని సూచించారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం డీఎంఅండ్హెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు సందర్శించారు. రికార్డులను ,మందుల నిల్వలను, పరిసరాలను పరిశీలించారు. వైద్య చికిత్సకు వచ్చిన రోగులతో ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవన నిర్మాణం నేపథ్యంలో పాత భవనాన్ని తొలగించనున్నందున ఆసుపత్రిని తాత్కాలికంగా ఆసుపత్రి ఆవరణలో ఉన్న క్లస్టర్ భవనం, హోమియో ఆసుపత్రిలోకి మార్చాలని డీఎంఅండ్హెచ్వో వెంకటేశ్వర్ రావు ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి సూచించారు. డాక్టర్ పరిక్షీత్ నరేంద్రకు పలు సూచనలు చేశారు. కొత్త భవనం నిర్మాణం నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు వెంకటేశ్వర్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడ్మినిస్ర్టేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, డాక్టర్లు పరీక్షత్ నరేంద్ర, హోమియోపతి డాక్టర్ అర్చనారెడ్డి, సిబ్బంది హన్మంత్, ఇందిర, ఏసుమణి, కృష్ణలీల, సునీత, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.