Share News

భానుడి భగభగ.. జనం బేజారు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:38 AM

భానుడి భగభగతో ప్రజలు బేజారవుతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి.

భానుడి భగభగ.. జనం బేజారు
తాండూరులో ఎండవేడిమికి కూలీలు లేక నిర్మానుష్యంగా మారిన నాపరాతి గని

తాండూరురూరల్‌, ఏప్రిల్‌ 18: భానుడి భగభగతో ప్రజలు బేజారవుతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అయితే రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యవసాయ, నాపరాతి గనుల్లో పనులకువెళ్లే దినసరి కూలీలు ఉదయం 10గంటలకే ఇంటిబాట పడుతున్నారు. భానుడి భగభగతో మండలం నిప్పులకొలిమిగా మారింది. మధ్యాహ్నం 3గంటల వరకు ఎండవేడిమి తగ్గుముఖం పట్టడంలేదు. రాత్రి 7గంటల వరకూ జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పరిస్థితి ఇలాఉంటే మే నెలలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సుమారు 40 నుంచి 41డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈసారి కూడా 41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండలంలోని ఓగీపూర్‌, మల్కాపూర్‌, కరన్‌కోట్‌, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, సంగెంకలాన్‌, కొత్లాపూర్‌, సిరిగిరిపేట్‌, కోటబాస్పల్లి, తదితర గ్రామాల పరిధిలో నాపరాతి గనులు విస్తరించి ఉండటంతో ఈప్రాంతాల్లో ఎండ వేడిమి అత్యధికంగా ఉంటుంది. ఈ వేడిమితో కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో రద్దీమార్గాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల ప్రభావంతో మార్కెట్‌లో కొబ్బరి బోండాలు, శీతల పానియాలు, మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లు, జ్యూస్‌ల విక్రయాలు జోరుగాసాగుతున్నాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో పలు గ్రామాల్లో చిన్నచిన్న వ్యాపారస్తులు జ్యూస్‌ బండ్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:38 AM