ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:15 AM
సంక్రాంతి సందర్భంగా చేవెళ్ల ఆర్టీసీ బస్స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పట్టణాల నుంచి ప్రజలు తమ సొంత గ్రామాలకు తరలివెళ్తుండటంతో పల్లెల్లో పండుగ వాతవారణం వచ్చేసింది.
సంక్రాంతిని పురస్కరించుకొని సొంతూళ్లకు తరలిన ప్రయాణికులు
విద్యాలయాలకు సెలవులతో ఇంటిబాట పట్టిన విద్యార్థులు
కిటకిటలాడిన చేవెళ్ల ఆర్టీసీ బస్టాండ్
చేవెళ్ల, జనవరి 11 : సంక్రాంతి సందర్భంగా చేవెళ్ల ఆర్టీసీ బస్స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పట్టణాల నుంచి ప్రజలు తమ సొంత గ్రామాలకు తరలివెళ్తుండటంతో పల్లెల్లో పండుగ వాతవారణం వచ్చేసింది. గురువారం చేవెళ్ల బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు భారీసంఖ్యలో బస్టాండ్లో కన్పించారు. చేవెళ్ల మీదుగా వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్, కోస్గి, షాద్నగర్, శంకర్పల్లి మీదుగా వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
కిక్కిరిసిన బస్సులు.. ప్రయాణికులు ఇక్కట్లు
యాచారం, జనవరి 11 : సంక్రాంతిని పురస్కరించుకొని విద్యాలయాలకు ప్రభుత్వం శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించడంతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్రూయిజర్లలో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్లారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ గ్రామాలకు వెళ్లడానికి సామగ్రితో గమ్యస్థానాలకు చేరుకునేందుకు నానా తంటాలు పడ్డారు. గురువారం ఉదయం 11 గంటల నుంచే ఆర్టీసీ బస్సులు, ఆటోలు. క్రూయిజర్లలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు తరలివెళ్లారు. దేవరకొండ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికులు ఫుట్బోర్డుపై నిలబడి ప్రయాణించడం కనిపించింది. యాచారం మండలంలోని పలు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు గురువారం సాయంత్రం తమ ఇళ్లకు తరలివెళ్లారు.