భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
ABN , Publish Date - Oct 22 , 2024 | 11:51 PM
భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పర దాడులకు పాల్పడటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఇద్దరికి తీవ్రగాయాలు
కులకచర్ల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పర దాడులకు పాల్పడటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అంతారం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అంతారం గ్రామానికి చెందిన కావలి రాములు, వేపూరి రామయ్య కుటుంబాల మధ్య భూమి విషయంలో 15 సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి. రెండు కుటుంబాలను గ్రామపెద్దలు రాజీ చేసినా గొడవపడుతూనే ఉన్నారు. సోమవారం భూమి విషయంలో మరో మారు రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. రాత్రి సమయంలో కావలి రాములతో పాటు బసప్ప (ప్రభుత్వ ఉపాధ్యాయుడు), చెన్నయ్య తదితరులు వేపూరి రామయ్య ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో ఉన్న వేపూరి చంద్రమౌళి, నారాయణమ్మ, వెంకటయ్య, లావణ్య, శ్రీకాంత్, శరత్పై కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో వేపూరి చంద్రమౌళి, నారాయణమ్మలకు తీవ్రగాయాలు కాగా హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అన్వే్షరెడ్డి తెలిపారు.