తాగునీటి సమస్య తలెత్తనీయొద్దు
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:12 AM
వేసవి ఎండల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు చొరవ తీసుకోవాలని అడిషనల్ డీఆర్డీవో సూర్యరావు సూచించారు. ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ఆమనగల్లు, ఏప్రిల్ 18 : వేసవి ఎండల నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, పంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు చొరవ తీసుకోవాలని అడిషనల్ డీఆర్డీవో సూర్యరావు సూచించారు. ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవో శ్రీకాంత్ అధ్యక్షతన తాగునీటి సరఫరా, నిర్వహణపై మిషన్ భగరథ అదికారులు, గ్రామ పంచాయతీల స్పెషలాఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా తాగునీటి సరఫరా, ప్రత్యమ్నాయ తాగునీటి వనరులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనాభా, కేటాయింపులకు అనుగుణంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూర్యరావు సూచించారు. ఏదైనా కారణం చేత నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే పంచాయతీ పరిధిలోని బోర్ల ద్వారా నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. తహసీల్దార్ లలిత, ఎంపీవో శ్రీలత, మిషన్ భగీరథ డీఈ మోహన్రెడ్డి, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.